సుశీల్‌కు బిగుస్తున్న ఉచ్చు!

సుశీల్‌కు బిగుస్తున్న ఉచ్చు!
  • ఛత్రసాల్‌‌ స్టేడియంలో సీన్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌
  • గ్యాంగ్‌‌స్టర్స్‌‌తో సంబంధాలపై ఆరా తీస్తున్న పోలీసులు

న్యూఢిల్లీ: స్టార్‌‌ రెజ్లర్‌‌ సుశీల్‌‌ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యంగ్ రెజ్లర్‌‌ సాగర్‌‌ రాణా  హత్యకేసులో  అతనికి పెద్ద శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. సాగర్​పై దాడిలో సుశీల్‌‌ స్వయంగా పాల్గొన్నాడని ఆధారాలు సేకరించిన  ఢిల్లీ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.  మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో సుశీల్​ను ఛత్రసాల్​ స్టేడియానికి తీసుకెళ్లారు.  సీన్​ రీక్రియేషన్​ ​ ద్వారా మరి కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు.  కాగా, బలమైన వస్తువుతో తల మీద కొట్టడం వల్ల సాగర్​ మరణించాడని డాక్టర్లు పోస్ట్​మార్టం రిపోర్ట్​లో పేర్కొన్నారు. కాగా,  సుశీల్​, అతని అనుచరుడు అజయ్​ ​ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు రిమాండ్‌‌లోకి తీసుకున్నారు. అయితే, ఆ రోజు రాత్రి లాకప్​లో ఉన్న సుశీల్​ బాగా ఏడ్చాడని, ఆహారం తీసుకోలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. రాత్రంతా నిద్రపోలేదని చెప్పాయి. మరోవైపు గ్యాంగ్‌‌స్టర్స్‌‌తో సుశీల్‌‌ సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తీహార్‌‌ జైలులో ఉన్న ప్రముఖ గ్యాంగ్‌‌స్టర్‌‌ నీరజ్‌‌ బవాన ఈ హత్య కేసులో సుశీల్‌‌కు సాయం చేశాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఛత్రసాల్​ స్టేడియంలో సాగర్‌‌పై దాడిలో నీరజ్‌‌ అనుచరులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. 

రైల్వే శాఖ సస్పెన్షన్​ వేటు.. 
సుశీల్​పై  రైల్వే శాఖ చర్యలు తీసుకుంది.​ నార్తర్న్​​ రైల్వేస్​లో సీనియర్​ కమర్షియల్​ మేనేజర్​గా పని చేస్తున్న స్టార్​ రెజ్లర్​ను ఆ పదవి నుంచి సస్పెండ్​ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.