మామిడి పండ్లు సహజంగా మగ్గాయా.. రైపెనర్స్ వాడారా.. తేడా తెలుసుకోవడం ఇలా..

మామిడి పండ్లు సహజంగా మగ్గాయా.. రైపెనర్స్ వాడారా.. తేడా తెలుసుకోవడం ఇలా..

పైకి పచ్చగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ కనిపిస్తున్న మామిడి పండ్ల లోపల కాలకూట విషం ఉంటున్నది. రంగు చూసి పొంగిపోయి తింటే.. రసాలు ఊరాల్సినవి కాస్తా రుచీపచీ లేకుండా చప్పగా ఉంటున్నాయి. బయట ఆకట్టుకునే తొక్క ఉంటున్నా వాటిలో తియ్యదనం మచ్చుకైనా ఉంటలేదు. నిషేధిత కాల్షియం కార్బైడ్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర ఇథిలిన్ రైపనర్లతో మగ్గబెట్టడం వల్లే మామిడి పండ్లు ఇలా మారుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి మేలో రావాల్సిన మామిడి పండ్లు హైదరాబాద్ ​ప్రధాన మార్కెట్లలోకి మార్చి నుంచే దర్శనమిస్తున్నాయి. వ్యాపారుల లాభాపేక్షే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 

గ్రామాల్లో గాలి దుమారానికి రాలిన మామిడి కాయలతో పాటు పక్వానికి రాకముందే కోసిన కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. వాటిని మగ్గబెట్టేందుకు నిషేధిత కెమికల్స్‌‌‌‌‌‌‌‌ను వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి విక్రయాలు జరిగే జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, మంచిర్యాల తదితర  జిల్లాల్లోని మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీటిని తింటున్న జనం రోగాలబారిన పడ్తున్నారు. 

పండ్లలో తేడాను గుర్తించండిలా.. 

సహజంగా పండిన మామిడి పండ్లు.. పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా త్వరగా పాడైపోదు. సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ రైపనర్ వాడిన పండ్లకు.. మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్‌‌గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి. 

కార్బైడ్‌‌తో మగ్గించిన పండ్లు హానికరం..

కార్బైడ్‌‌తో మగ్గించిన పండ్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. మెగ్నీషియం, కార్బన్స్ ప్రభావం ఎక్కువై అనారోగ్యం తలెత్తుతుంది. ప్రధాన అవయవాలపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే సహజంగా మగ్గిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. కార్బైడ్‌‌తో మగ్గించిన పండ్లు చూడడానికి నిగనిగలాడుతాయి. కానీ రుచిగా ఉండవు. నేను కూడా ఇటీవల హుజూరాబాద్‌‌లో మామిడి పండ్లను కొని, ఇంటికి తీసుకెళ్లి తిన్న తర్వాత  తెలిసింది.. అందులో కొన్ని రసాయనాలతో మగ్గించిన పండ్లు అని. అందుకే కొనేటప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే.  - 
డాక్టర్ శ్రీకర్ మోడెపు