తిరుమలలో భక్తుల సునామీ : ఉచిత దర్శనానికి 25 గంటల సమయం

 తిరుమలలో భక్తుల సునామీ : ఉచిత దర్శనానికి 25 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.  వీకెండ్​ కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు.  తిరుమలగిరులు గోవింద నామ స్మరణతో మారు మోగుతున్నాయి.   భక్తులు భారీగా తరలి రావడంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 25 గంటలు పడుతుంది. 

తిరుమలలో భక్తుల తాకిడి బాగా పెరిగింది. క్యూలైన్ల బయట 4కి.మీ. మేర భక్తులు బారులు తీరారు. సాధారణంగా   శుక్ర, శని, ఆది వారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  వేసవి సెలవులు ముగిసినా.. నెలరోజులుగా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.  

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో  భక్తులు ఇబ్బంది పడకుండా   టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు అందుతున్న సౌకర్యాలను  టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్ల దగ్గర ..  14 ప్రదేశాల్లో అన్న ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులకు మజ్జిగ, మంచినీరు, అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా  నిరంతరం పంపిణీ చేస్తున్నారు. 

వైకుంఠం లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 25 గంటలు పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 7 గంటలు, 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 

ఇక నిన్న  ( జూన్​ 20) శుక్రవారం తిరుమల శ్రీవారిని  76వేల 181 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో  33వేల874 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.88 కోట్ల రూపాయలు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు...