తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది.  ఆర్జిత సేవా టిక్కెట్ల షెడ్యూల్‌ను  విడుదల చేసింది.  ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్‌లో టికెట్లు పొందిన వాళ్లు డబ్బులు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదేవిధంగా రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు. 

ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ఈ తేదీలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది.