తిరుమల నడక మార్గంలో తినుబండారాలు నో సేల్..

తిరుమల నడక మార్గంలో  తినుబండారాలు నో సేల్..

తిరుమల నడక మార్గంలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. టీటీడీ , అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టినా చిరుతలు భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.  ఇప్పటికే  అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గంలో కొన్ని ఆంక్షలను విధించారు. అదే సమయంలో భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అధికారులు శుక్రవారం ( ఆగస్టు 18) సమావేశమయి నడకమార్గంలోని దుకాణదారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. 

ఏడుకొండల స్వామి నడక మార్గాల్లో  కొంతమంది దుకాణాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి షాపు యజమానులకు భక్తుల భద్రత దృష్ట్యా  టీటీడీ ఈవో ధర్మారెడ్డి పలు సూచనలు చేశారు.  తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులు  దుకాణాల నిర్వాహ‌కుల‌తో ఈవో స‌మావేశం నిర్వహించి ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.

పండ్లు, కూరగాయలు అమ్మకాలపై  నిషేధం

న‌డ‌క‌మార్గాల్లో విక్రయాల‌కు సంబంధించి అధికారుల‌తో పాటు ప‌లువురు భ‌క్తులు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు ఈవో తెలిపారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాల షాపులు  ఉన్నాయ‌ని, వీటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్రయించ‌రాద‌ని సూచించారు.  భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల వాటి రాక పెరుగుతోంద‌ని, ఈ జంతువుల కోసం క్రూర‌మృగాలు  వ‌చ్చి భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని వివ‌రించారు. అన్ని దుకాణాల వ‌ద్ద త‌డి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చెత్తకుండీల్లో వేయాల‌ని సూచించారు.  ఇలా చేయని షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

 న‌డ‌క మార్గంలో రోజుకు రెండు నుండి మూడు ట‌న్నుల చెత్త పోగ‌వుతోంద‌ని, వీటిని ఆరోగ్య శాఖ సిబ్బంది క్రమం త‌ప్పకుండా తొల‌గిస్తున్నార‌ని చెప్పారు.  నడకదారిలో సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తినుబండారాల దుకాణదారులు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధ‌న‌లు త‌ప్పక పాటించాల‌న్నారు. క్రూర‌మృగాల ఆనవాళ్లు క‌నిపిస్తే వెంట‌నే తెలిపేందుకు వీలుగా అట‌వీ, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నంబ‌ర్లు ప్రద‌ర్శిస్తామ‌ని ఈవో తెలిపారు.