
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి రైల్వే స్టేషన్లో తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్కు కృషి చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గత కొంత కాలంగా తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ను రద్దు చేశారు. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను కలిసి, రైలు హాల్టింగ్పై ఇటీవల వినతిపత్రం అందజేశారు.
ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు స్పందించి తిరుపతి ఎక్స్ప్రెస్ను పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నిలుపుతున్నట్లు గురువారం అధికారికంగా లేఖ విడుదల చేశారు. పెద్దపల్లి బైపాస్ లైన్ పూర్తి కావడంతో తిరుపతి ఎక్స్ప్రెస్ను కరీంనగర్ నుంచి పెద్దపల్లి బైపాస్ ద్వారా కాజీపేటకు వెళ్లేలా అధికారులు రూట్ మ్యాప్ ప్రకటించారు. కాగా, పెద్దపల్లిలో తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణకు సహకరించిన రైల్వే అధికారులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.