
మంచిర్యాల: అబద్ధాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. మంచిర్యాల కలెక్టరేట్ ముందు నిర్వహించిన అఖిల పక్షం ధర్నాలో కోదండరాం పాల్గొన్నారు. వరద బాధితులతో కలిసి కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేల ఎరాల్లో పంట మునిగి రైతులు నష్టపోయారన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక చాలా మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనను కేసీఆర్ గాలికొదిలేశారని మండిపడ్డారు. వరద బాధితులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
పరిహారం అందించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా పేరుతో సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు. గోదావరి వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, సమగ్ర సర్వే చేసి వరద బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదల, నీటి నిర్వహణకు సంబంధించిన మాన్యువల్ రూపొందించాలని, జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రాజెక్టు లోని 3 బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచాలని సూచించారు. కరకట్టలు నిర్మించి మంచిర్యాల పట్టణాన్ని వరద ప్రభావం నుంచి కాపాడాలన్న ఆయన... కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.