- రెండు నెలల్లో ఆగిన రుణాలు రూ.11 వేల కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఇప్పటి వరకు ఇష్టమున్నట్లు తీసుకున్న అప్పులను ఎలా కడ్తరనేది రాష్ట్ర సర్కార్ సక్కగ చెప్పక పోవడంతో మే నెలకు అప్పు పుట్టలేదు. శుక్రవారం ఆర్బీఐ రీలీజ్ చేసిన నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కలేదు. శుక్రవారం రూ.3 వేల కోట్లకు అప్పు కోరుతూ రాష్ట్ర సర్కారు ఆర్బీఐకీ విజ్ఞప్తి పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాక పోవడంతో ఆర్బీఐ నిర్వహించే బాండ్ల వేలం పాటలో తెలంగాణ పేరు చేర్చలేదు. ఈ నెలలో రాష్ట్ర సర్కారు రూ.8వేల కోట్ల అప్పు తీసుకోవాలని భావించింది.
అయితే గతంలో చేసిన అప్పులు, గ్యారెంటీ పేరుతో తీసుకున్న రుణాలు ఎలా తిరిగి చెల్లిస్తారో చెప్పాలని కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాన్ని అడిగింది. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు లెటర్లు రాసింది. ఆ లేఖల్లో అప్పులతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని, అవి పూర్తయిన తర్వాతే వాటి కోసం తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేందుకు వీలు పడుతుందని స్పష్టం చేసింది.
అయితే అప్పులు తిరిగి చెల్లించే దానిపై స్పష్టమైన విధానం ప్రభుత్వానికి లేకపోవడంతో కేంద్రం పర్మిషన్ ఇవ్వడం లేదని తెలుస్తున్నది. గత వారం ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు కూడా ఢిల్లీకి వెళ్లి నాలుగైదు రోజులు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నాధికారులను కలిశారు. అప్పుడు కూడా అప్పుల లెక్కలు వాటిని తిరిగి చెల్లింపులపై క్లారిటీ ఇవ్వక పోవడంతోనే ఈసారి ఆర్బీఐ నోటిఫికేషన్లో తెలంగాణకు అవకాశమివ్వలేదని తెలిసింది. దీంతో 2 నెలల్లో రాష్ట్రానికి అప్పుల రూపంలో రావాల్సిన రూ.11 వేల కోట్లు నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి
విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు
ఎన్టీఆర్ ఒక ప్రభంజనం..ఒక సంచలనం
దమ్ముంటే మీరు పార్లమెంట్ రద్దు చేయండి.. మేం అసెంబ్లీని రద్దు చేయిస్తం