Today OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌ బస్టర్స్.. యూత్ & డార్క్ కామెడీ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Today OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌ బస్టర్స్.. యూత్ & డార్క్ కామెడీ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

సినీ ఆడియన్స్కి అదిరిపోయే వీకెండ్ (మే8, 2026న) మొదలైంది. ఓ పక్క థియేటర్ సినిమాలు, మరోవైపు ఓటీటీ కంటెంట్. ఇలా అన్నిరకాలుగా కొత్త సినిమాలు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయనున్నాయి. థియేటర్లో రవిబాబు డైరెక్ట్ చేసిన ‘రేజర్’, సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’, లావణ్య త్రిపాఠీ ‘సతీ లీలావతి’ సినిమాలు ఉన్నాయి. ఇవి వేటికవే డిఫరెంట్ జానర్ సినిమాలుగా ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. అయితే, బడా హీరోల సినిమాలు రిలీజ్ కావడానికి మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు. పెద్దితో (జూన్ 4) ఆట మొదలవ్వనుంది.

ఇదిలా ఉండగా.. ఓటీటీలో మాత్రం రెండు మలయాళ తెలుగు డబ్బింగ్ సినిమాలు ఈ వీకెండ్ ఆడియన్స్కి భలే కిక్ ఇవ్వనున్నాయి. అందులో ఒకటి మలయాళ బ్లాక్ బస్టర్ ‘వాలా 2’ కాగా, మరొకటి డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘భరతనాట్యం 2: మోహినియాట్టం’. ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్కి కూడా అందుబాటులో ఉండనున్నాయి. మరి వాటి కథలు ఏంటి? అవెక్కడ స్ట్రీమింగ్కి వచ్చాయి? అనేది ఓ లుక్కేద్దాం. 

‘వాలా 2’ ఓటీటీ:

ఇటీవల కేరళ బాక్సాఫీస్ దగ్గర రెండు వందల కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించిన చిత్రం ‘వాలా 2’. సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి యువ నటీనటులు నటించారు. దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ కీలక పాత్ర పోషించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి తెలుగులో రిలీజ్ చేశారు. ఇపుడు ఈ యూత్ కాలేజ్ డ్రామా మే 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ స్ట్రీమ్ అవ్వనుంది. 

‘వాలా 2’ కథ:

హాషిర్‌, అలన్‌, అజిన్‌, వినాయక్ అనే నలుగురు మధ్యతరగతి కుర్రాళ్ళ చుట్టూ కథ తిరుగుతుంది. చదువుకంటే అల్లరి, గొడవలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆ సరదాలు క్రమంగా చెడు అలవాట్లకు లోనై డ్రగ్స్‌ వరకు వెళ్తారు. ఒక సందర్భంలో డ్రగ్స్‌ మత్తులో టీచర్‌పై చేయి కూడా చేసుకుంటారు. ఈ కారణంగా, ఆ నలుగురిని కాలేజీ నుంచి బయటకు పంపిస్తారు.

ఇక పరీక్షలు రాయడానికి కూడా అనుమతి ఇవ్వమని యాజమాన్యం చెప్పడంతో, వారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతాయి. ఈ క్రమంలోనే, ఆ టౌన్ ఎస్సై రిక్వెస్ట్ చేయడంతో వీరికి మళ్లీ పరీక్షలు రాసే అవకాశం లభిస్తుంది. చదువు పూర్తవుతుంది. అయినప్పటికీ, సమాజం మాత్రం వీరిని ‘లూజర్స్‌’గానే చూస్తుంది.

అలా పాఠశాల దశలో ‘వేస్ట్ బ్యాచ్‌’గా ముద్రపడిన ఈ నలుగురు కుర్రాళ్ళు చివరకు ఏం తెలుసుకున్నారు. జీవితంలో నిలదొక్కుకోవడానికి దుబాయ్‌, యూకే వంటి దేశాలకు వెళ్లి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? చివరికి తమ జీవితాలను ఎలా మార్చుకున్నారు? అన్నదే మిగతా కథ.

‘భరతనాట్యం 2’ ఓటీటీ:

మలయాళంలో సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ 'భరతనాట్యం 2: మోహినియాట్టం'. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్, థియేటర్లలో సుమారు రూ.40 కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. ఇందులో సైజు కురుప్, సూరజ్ వెంజరమూడు, జగదీష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుందని సమాచారం. 2024లో వచ్చిన భరతనాట్యం మూవీకి సీక్వెల్.

కథేంటంటే..

దివంగత భరతన్ నాయర్ కుటుంబం.. అతని ఇద్దరు భార్యలు, పెద్ద కొడుకు (సైజు కురుప్)తో సహా ఇద్దరు పిల్లలు శ్రీకందపురానికి బయలుదేరుతారు. ఆ ఊరిలోనే వారు స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. కానీ భరతన్ చేసిన పనులు ఇంకా వెలుగులోకి వస్తాయి. వారి సహచరుడైన గోవిందన్ (సూరజ్ వెంజరమూడు) కొత్త ఇంట్లో వారిని కలవడానికి వస్తాడు. అనంతరం మరుగున పడిపోయిన కుటుంబ రహస్యాలు బయటపడతాయి. మరి ఆ రహస్యం ఏమిటి? దానికితోడు అనూహ్యంగా జరిగిన ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి అతని కుటుంబం పడే ఇబ్బందులు, వారిపై పడే ఒత్తిడి, ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సీక్వెల్ కథ.