
- స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను ఆమోదించే చాన్స్
- మైనింగ్ సినరేజ్, అడ్వకేట్ ప్రొటెక్షన్ ముసాయిదాలపై చర్చ
- బీసీ రిజర్వేషన్లపై డిస్కస్ చేసే అవకాశం
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల కుల గణన సర్వేపై ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో సీబీ ఇండెక్స్ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్పై మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆమోదం తీసుకోనున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వ పాలసీలు, పథకాల రూపకల్పన చేయనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో పంటల పరిస్థితి, యూరియా నిల్వలపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై అధికారులు ఇచ్చిన రిపోర్ట్పైనా చర్చిస్తారు. మైనింగ్ సినరేజ్ అంశంపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతోపాటు అడ్వకేట్ ప్రొటెక్షన్కు సంబంధించిన ముసాయిదాపై చర్చించి ఆమోదం తీసుకోనున్నట్లు సమాచారం.
బీసీ రిజర్వేషన్లపై ఫోకస్
పంచాయతీరాజ్ చట్ట సవరణ 2018కి సంబంధించి ఆర్డినెన్స్ ఫైల్ ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దాదాపు 15 రోజులు కావొస్తున్నా.. ఇంకా గవర్నర్ నుంచి నిర్ణయం వెలువడకపోవడంతో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కోర్టు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించడంతో ఏం చేయాలనే దానిపై కేబినెట్లో చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అవసరమైతే ఈ విషయంలో గవర్నర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కలిసి.. చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలుస్తున్నది. దీంతోపాటు వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం, గోశాలల నిర్మాణం, గోవుల సంరక్షణ కోసం సమగ్రమైన విధానం, సాగునీటి ప్రాజెక్టులు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంపై కేబినెట్భేటీలో చర్చించనున్నారు.