సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు ఈ సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్ లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి వెంకట నరసింహారావు వయస్సు 73 సంవత్సరాలు. రాళ్లపల్లికి ఇద్ధరు కుమార్తెలు. ఒక కూతురు అమెరికాలో ఉంటుంది. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. 

ఇంటిపేరుతోనే ఆయన ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మొదటి సినిమా “స్త్రీ”. టాలీవుడ్ లో రాళ్లపల్లిది సుదీర్ఘ ప్రయాణం. 1979 నుంచి.. .2019 వరకు…  40 ఏళ్ల పాటు ఆయన తెలుగు సినీ పరిశ్రమలో అనేక పాత్రలు పోషించారు. 

వంశీ దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్, హారర్ మూవీ అన్వేషణలో  రాళ్లపల్లి పాత్రను ఎవరూ మరిచిపోలేరు. 1985లో ఈ సినిమా విడుదలైంది. రాళ్లపల్లికి మైల్ స్టోన్ పాత్రలా నిలిచిపోయింది. ఆయన పోషించిన కిల్లర్ పాత్ర ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.

ఖైదీ, తూర్పు వెళ్లై రైలు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, శుభలేఖ, అభిలాష, రుస్తుం, రెండు రెళ్లు ఆరు, అహ నా పెళ్లంట, సంకీర్తన, కూలీ నంబర్ 1, ఏప్రిల్ 1 విడుదల, అల్లరి అల్లుడు, బొంబాయి, గోకులంలో సీత, చంద్రలేఖ, చిత్రం, కలిసుందాం రా, నువ్వు నేను, హనుమాన్ జంక్షన్ సహా.. 850 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా నాని హీరోగా వచ్చిన భలేభలే మగాడివోయ్. 

దర్శకులు వంశీ, తేజ సినిమాల్లో ఎక్కువగా కనిపించారు రాళ్లపల్లి.  సుదీర్ఘ కాలం సినిమాల్లో కనిపించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ సీరియల్స్ లోనూ నటించారు రాళ్లపల్లి. ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది.