రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ

రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర కేబినెట్‌ మంగళవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో కొత్త మున్సిపల్‌ చట్టానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. గురు, శుక్రవారాల్లో జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ఈ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన అర్బన్‌ పాలసీలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, హైదరాబాద్‌ నగర కార్పొరేషన్​కు చట్టాలను తీసుకువస్తున్నారు. హెచ్‌ఎండీఏతో పాటు ఇతర నగరాల అభివృద్ధి మండళ్లకు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి తేనున్నారు. సంబంధిత చట్టాల డ్రాఫ్ట్‌కు న్యాయ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

ఇంకేం అంశాలుంటాయి?

జూన్‌ 18న కేబినెట్‌ భేటీలో అసెంబ్లీ, సెక్రటేరియట్​ కొత్త భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి, డైరెక్టర్‌ ఎన్‌.శంకర్‌కు, శారదా పీఠానికి భూములు కేటాయించారు. అయితే పీఆర్సీ, ఉద్యోగుల రిటైర్మెంట్‌ పెంపుపై తర్వాత జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో మంగళవారం భేటీలో ఏ అంశాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ, సెక్రటేరియెట్‌, వాటిపై కోర్టు కేసులు, టెక్నికల్‌, మినిస్టర్స్‌ కమిటీల నియామకం, ఆ కమిటీల ప్రాథమిక నివేదికలపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. కేవలం మున్సిపల్​ చట్టానికి ఆమోదం తెలపడంతోనే సరిపెట్ట వచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.