హైదరాబాద్లో ఫిలించాంబర్లో రేపు (ఆదివారం) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో కిందటి సారి పోటీ లేకుండానే శివాజీరాజాని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం నరేశ్ నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ ఏర్పడింది. గతంలో కలిసి పనిచేసిన శివాజీరాజా, నరేశ్లు ప్రస్తుతం అసోసియేషన్లో నెలకొన్న విభేధాల కారణంగా రెండు గ్రూపులుగా విడిపోయి అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. రెండు వర్గాలు కూడా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఆర్టిస్టుల సంక్షేమం కోసం హామీల వర్షం కురిపిస్తున్నారు. సినీనటుడు నాగబాబు నరేశ్ ప్యానెల్కు మద్దతు ప్రకటించారు. ‘మా’ లో పాత వారు కొనసాగకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నాగబాబు అన్నారు.
మరోవైపు తనను,‘మా’ అధ్యక్ష పదవిని నరేశ్ అవమానించారంటూ శివాజీరాజా ఆరోపించారు. మెగాస్టార్ చిరంజీవిని తప్పుదోవ పట్టించి అధ్యక్ష ఎన్నికల్లో నరేశ్ పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.