మీడియా ముందుకు మావో అగ్రనేత భార్య

మీడియా ముందుకు మావో అగ్రనేత భార్య

మావోయిస్ట్ దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న భార్య సావిత్రి పోలీసుల ముందు  లొంగిపోయింది. ప్రస్తుతం సావిత్రి కిష్టాపురం ఏరియా కమిటీ సెక్రటరీగా ఉంది.  వరంగల్  జిల్లాకు చెందిన రామన్న 2019లో గుండెపోటుతో చత్తీస్ ఘడ్  అడవుల్లో చనిపోయాడు.  రామన్న మరణం తర్వాత గతేడాది సావిత్రి కుమారుడు రంజిత్ లొంగిపోయాడు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్,జార్ఖండ్, తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా రామన్న ఉన్నాడు. 1994లో దళం సభ్యురాలు సావిత్రిని రామన్న పెళ్లి చేసుకున్నాడు. రామన్నపై గతంలో రూ. 40లక్షల రివార్డ్ ఉంది. ఇవాళ ఉదయం లొంగిపోయిన సావిత్రిని డీజీపీ మహేందర్ రెడ్డి  మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ మహేందర్ రెడ్డి.. ‘మావోల ఐడియాలజీపై మక్కువతో  సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టులోకి వెళ్ళింది. 1992 లో కొంట దళం లో చేరింది.. అక్కడే రామన్న దళ కమాండర్ గా ఉన్నాడు . 30 ఏళ్ల ప్రస్థానంలో 350 మంది యువతను మావోయిస్టు వైపు  మళ్లించింది. మావోయిస్టులు తనను దూరం పెట్టడం, సైడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని సావిత్రి లొంగిపోతున్నట్లు చెప్పింది. సావిత్రి పార్టీకి సమాచారం ఇవ్వకుండానే లొంగి పోయింది. సావిత్రి శిక్షణలో భాగంగా ఇంగ్లీష్, తెలుగు రాయడం మాట్లాడడం నేర్చుకుంది. ఛత్తీస్ ఘడ్ లో సావిత్రి పై 10 లక్షలు రివార్డు ఉంది , ఆమె మొత్తం ఛతీస్ ఘడ్ లోనే పని చేసింది. సావిత్రిలాగే చాలా మంది మావోయిస్టు పార్టీ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు.కానీ జనజీవన స్రవంతిలో కలవకుండా మావోయిస్టు పార్టీ అడ్డుకుంటోంది’ అని అన్నారు.

‘మావోయిస్టులు ఉన్న చాలా మందు సీనియర్లు నడిచే పరిస్థితి లేక , అనారోగ్యంతో భాద పడుతున్నారు. అక్కడ కనీసం వైద్య సదుపాయం కూడా లేదని తమతో చెప్పారు. ఛత్తీస్ ఘడ్  లో ప్రజలు మావోల వైపు లేరని సావిత్రి చెప్పారు. మావోయిస్టు పార్టీలోకి బలవంతంగా చేరుస్తున్నారు తప్ప, ఎవరు కూడా స్వయంగా మావోల వైపు రావడం లేదు. స్కూల్స్ , సదుపాయాలు ప్రభుత్వమే కల్పించడంతో ఎవరు కూడా మావోయిస్టు వైపు రావడం లేదు.   మావోయిస్టులు లొంగిపోతే వారికి కావాల్సిన వసతులు, రివార్డు, ప్రభుత్వం నుండి రావాల్సిన బేఫిట్స్ అన్ని ఇచ్చేలా చూస్తాం.  జనజీవన స్రవంతి లో కలిసి పోయేలా మేము చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.