
- టూరిజం, పోలీస్ శాఖల సమన్వంతో విధివిధానాలు
- వరల్డ్ టూరిజం డే సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు
- డీజీపీ, టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీసు శాఖ వినూత్న పోలీసింగ్కు శ్రీకారం చుట్టింది. టూరిస్టుల భద్రత కోసం ‘టూరిస్ట్ పోలీస్’ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్ట్ పోలీసింగ్ను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ టూరిజం శాఖ మధ్య బుధవారం సమన్వయ సమావేశం జరిగింది.
డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. డీజీపీ జితేందర్, తెలంగాణ టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ సహా అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్) మహేశ్ ఎం భగవత్, టూరిజం శాఖ ఎండీ క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సీహెచ్ ప్రియాంక, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ టూరిస్ట్ పోలీస్ గురించి వివరించారు.
మొదటి దశలో 80 మంది పోలీసులతో
రాష్ట్రంలోని టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిజం శాఖకు అవసరమైన 80 మంది పోలీసు సిబ్బందిని త్వరలోనే కేటాయిస్తామని డీజీపీ తెలిపారు. వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్ట్ పోలీసుల వ్యవస్థ సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ తదితర ప్రాంతాలలో టూరిస్ట్ పోలీసులు అవసరమని గుర్తించినట్టు తెలిపారు.
ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి పోలీస్శాఖ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. షూటింగ్ పర్మిషన్లు, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పర్యాటక శాఖ విధి విధానాలను రూపొందించాలని డీజీపీ సూచించారు.
తద్వారా ఆయా కార్యక్రమాలకు భద్రత కల్పించడం పోలీస్ సిబ్బందికి సులభం అవుతుందని తెలిపారు. స్పెషల్ సీఎస్ శ్రీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో దేశ విదేశీ టూరిస్టులు విస్తృతంగా పర్యటిస్తున్నారని, వారికి భద్రత కల్పించేందుకు టూరిస్ట్ పోలీసు అవసరం ఉందని తెలిపారు. ఆధ్యాత్మిక, మెడికల్, వినోదాత్మక పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే వారి భద్రత కోసం టూరిస్ట్ పోలీసులను కేటాయించాల్సి ఉందన్నారు.