
ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య శాఖ
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 61 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెల్త్క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, పరిసరాల అపరిశుభ్రతతో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు వస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
5 పీహెచ్సీల పరిధిలో కేసులు అధికం..
మాచారెడ్డి, అన్నారం, కామారెడ్డి ఆర్బన్, దేవునిపల్లి, లింగంపేట పీహెచ్సీల పరిధిలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయి. పలు తండాలు, గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వల్ల జ్వరాలు వస్తున్నాయి. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో రోజుకు సుమారు 100 మందికి వైరల్ ఫీవర్వస్తున్నట్లు గుర్తించారు.
కామారెడ్డి పట్టణంలోనూ పలువురు జ్వరాల బారిన పడుతుండడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల పాల్వంచ మండలం భవానిపేటలో సుమారు ఆరుగురికి డెంగ్యూ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. తాడ్వాయి మండలం దేమికలాన్లో గత నెలలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు చనిపోగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రంలో పారిశుధ్య లోపం అధికంగా ఉంది.
హెల్త్క్యాంపుల ఏర్పాటు..
ఆయా గ్రామాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఫీవర్ సర్వేతో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఇండ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వేడి పదార్థాలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
హైరిస్క్ ఏరియాల గుర్తింపు..
జిల్లాలోని మాచారెడ్డి, అన్నారం, కామారెడ్డి ఆర్బన్, దేవునిపల్లి, లింగంపేట పీహెచ్సీల పరిధులను హైరిస్క్ ఏరియాలుగా గుర్తించాం. గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి హెల్త్క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నాం. - డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో -కామారెడ్డి