కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ను ‘TS’ ను ‘TG’ చేయడంతోపాటు ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గీతంగా మారుస్తామన్నారు. హైదరాబాద్కు స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని.. సెప్టెంబర్ 17పై టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. తమ పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా కాదని, రాచరికానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. 2023 సెప్టెంబర్ 17లోపు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

41 ఏళ్ల కింద పుట్టిన బీజేపీ, 21 ఏళ్ల క్రితం పుట్టిన టీఆర్ఎస్కు సంబంధమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 75 ఏళ్ల తెలంగాణ విమోచన వజ్రోత్సవాలను నిర్వహించే హక్కు కాంగ్రెస్, కమ్యూనిస్టులదేనని తెలిపారు. తెలంగాణ తల్లి కూడా దొరల తల్లిగా మారిందన్న రేవంత్.. సబ్బండ వర్గాల కోసం కాంగ్రెస్ తరుపున తెలంగాణ తల్లి ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు

మక్తల్ నుంచి మద్నూర్ వరకు రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర

అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర భారత్ జోడో పాదయాత్ర ఉంటుందన్నారు. మక్తల్ వద్ద రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందన్న ఆయన..అక్కడి నుంచి దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, శంషాబాద్, తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగిపేట్, పెద్దశంకరంపల్లి, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుందని తెలిపారు. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.