టీఆర్​ఎస్​ పార్టీ పేరు మార్పు కుదరదు : రేవంత్ రెడ్డి

టీఆర్​ఎస్​ పార్టీ పేరు  మార్పు కుదరదు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్/ నిజామాబాద్, వెలుగు: బంగారు కూలీ పేరుతో టీఆర్​ఎస్ లీడర్లు వసూళ్లకు పాల్పడిన అంశంపై కేర్టులో కేసు ఉండగా పార్టీ పేరును బీఆర్​ఎస్​గా ఎలా మారుస్తారని పీసీసీ చీఫ్​రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం బోయిన్​పల్లిలోని ‘గాంధీయన్​ ఐడియాలజీ సెంటర్’​లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేరు మార్చాలంటూ టీఆర్​ఎస్​ దరఖాస్తు చేసుకున్నాక  అభ్యంతరాలపై పత్రికా ప్రకటన వచ్చిందని, దానిపై ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసేందుకు ఐదు సార్లు అపాయింట్​మెంట్​కోరినా దొరకలేదన్నారు. దాంతో  రాష్ట్రపతి, పీఎం, హోం మంత్రికి ఆన్​లైన్​లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. బంగారు కూలీల పేరుతో 2017లో టీఆర్​ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కోట్లు వసూలు చేసిన అంశంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసినట్టు చెప్పారు. తన వాదనలు విన్న కోర్టు టీఆర్​ఎస్​పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్​ కమిషన్​కు 2018లో ఆదేశాలిచ్చిందన్నారు. అయినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇదే అంశంపై ఈ నెల 6న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు రేవంత్ చెప్పారు. డిసెంబర్ 7న నోటీసు వెళ్లిందని, సోమవారం (డిసెంబర్​ 12) కేసు విచారణకు  రానుందన్నారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని పక్కన పెట్టి పార్టీ పేరు మార్పు ప్రక్రియను చేపట్టడం సరికాదనే అంశంపై తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెప్పారు. బీజేపీ సూచనల మేరకే ఎన్నికల కమిషన్​ టీఆర్​ఎస్​కు సహకరిస్తున్నదని రేవంత్​ఆరోపించారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఉన్న వాళ్లను ఢిల్లీకి పిలిచి విచారిస్తున్నారని, కానీ కవితను మాత్రం ఆమె కోరిన సమయానికి విచారణ చేస్తామనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీ, టీఆర్​ఎస్​లు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు.

బీఆర్​ఎస్​గా మార్చడం వెనక కుట్ర

టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చడం వెనక కుట్ర దాగి ఉందని రేవంత్​ఆరోపించారు. దక్షిణ భారత్​లో బీఆర్​ఎస్​ను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్​ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆప్, ఎంఐఎంలు ఉత్తర భారత్​లో ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతున్నాయన్నారు. కర్నాటకలో బీఆర్​ఎస్​ను ప్రయోగించి కాంగ్రెస్​ను అధికారంలోకి రాకుండా చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఏపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తానని చేసిన కామెంట్స్​ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదన్నారు.  సోనియా జన్మదినం సందర్భంగా గాంధీయన్ సెంటర్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రేవంత్​రెడ్డి ప్రారంభించారు. ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్​ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్​ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి పాల్గొన్నారు.

ఆ మూడు పార్టీలు సుపారీ కిల్లర్స్​

ఉత్తరాదిన ఆప్ నేత కేజ్రీవాల్, దక్షిణాదిన బీఆర్ఎస్  పేరుతో​ కేసీఆర్, ఎంఐఎం అసదుద్దీన్.. ఈ ముగ్గురు  కాంగ్రెస్ ను చంపేందుకు రెడీ అయిన సుపారీ కిల్లర్స్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఈ మూడు పార్టీలు బీజేపీ తోకపార్టీలన్నారు. శుక్రవారం నిజామాబాద్​లో రేవంత్​ మీడియాతో మాట్లాడారు. త్వరలో కర్నాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటును చీల్చేందుకు  బీఆర్​ఎస్​ పేరిట కేసీఆర్​ రెడీ అవుతున్నారన్నారు. గుజరాత్​ ఎన్నికల్లో కేసీఆర్​ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.  దేశంలో ఉన్న సమస్యలను తర్వాత పరిష్కరించొచ్చని, ముందు ధరణిలోని సమస్యలు తీర్చాలని డిమాండ్​ చేశారు. పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారని, అది ఏమైందని ప్రశ్నించారు. పార్టీ మారే నాయకులను మోడీ దగ్గరకు తీసుకెళ్లే అర్వింద్.. పసుపు బోర్డును ఎందుకు తీసుకురాలేకపోతున్నారన్నారు.