
- కామారెడ్డి ప్రధాన చౌరస్తాలు, మెయిన్ రోడ్లపై కనిపించని నియంత్రణ
- ఫైన్ల విధింపుపైనే తాత్కాలిక సిబ్బంది ఫోకస్
- జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేక సిబ్బంది కొరత
- సమస్య పరిష్కరించాలని జిల్లావాసుల మొర
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన చౌరస్తాలు, మెయిన్ రోడ్లపై వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకపోవడంతో సిబ్బంది కొరత ఉంది. తాత్కాలిక సిబ్బంది ఫైన్లు విధించటంపైనే ఫోకస్ పెడుతూ ట్రాఫిక్ను గాలికొదిలేస్తున్నారు. కామారెడ్డి 5 జిల్లాల కూడలి. పట్టణంలో లక్షన్నరకు పైగా జనాభా ఉంటుంది. పనుల నిమిత్తం వచ్చేవారు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. మార్నింగ్, ఈవ్నింగ్ స్కూల్స్, కాలేజీల సమయాల్లో ట్రాఫిక్ జామ్ తలనొప్పిగా మారుతోంది.
రద్దీ ప్రాంతాలు..
అశోక్ నగర్ కాలనీ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్, హౌసింగ్ బోర్డు కాలనీ వరకు ఉన్న మెయిన్ రోడ్డు, నిజాంసాగర్ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్, సిరిసిల్లా రోడ్డు, స్టేషన్ రోడ్డు, తిలక్రోడ్డు, సుభాష్ రోడ్డు, మాయాబజార్, పాత బస్టాండ్, ఇందిరా చౌక్, ధర్మశాల, రామారెడ్డి రోడ్డు ఏరియాలతోపాటు చౌరస్తాల వద్ద ట్రాఫిక్ రద్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియాల్లో షాపింగ్ మాల్స్ కూరగాయల దుకాణాలు, విద్యా సంస్థలు ఉన్నాయి. వీటికి తోడుగా రోడ్లు ఇరుకుగా ఉండడంతో చౌరస్తాల వద్ద యూటర్న్ తీసుకుంటున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతోంది. పార్కింగ్ లేక కొందరు వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. ఈ మెయిన్ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ఆఫీస్ వద్ద బస్సులు, హెవీ వెహికల్స్ యూ టర్న్ కష్టమవుతోంది. రాఖీ పౌర్ణమి టైంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
ఫైన్ల విధింపుపైనే ఫోకస్..
టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కొందరు, ఏఆర్ నుంచి కొందరు సిబ్బందిని నియమించారు. ఎస్సై, 10 మంది కానిస్టేబుల్స్, హోం గార్డులు ఉన్నారు. వీరు ప్రధాన చౌరస్తాల్లో ఉంటూ కేవలం ఫైన్ల విధింపునకే పరిమితమయ్యారు. హెల్మెట్లేని వారికి, త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, పాత ఫైన్ల వసూళ్లకే ప్రయార్టీ ఇస్తున్నారు.
ప్రతిపాదనలకే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్..
కామారెడ్డిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ప్రపోజల్ చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో అప్పటి సీఎం కేసీఆర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినా కార్యరూపం దాల్చలేదు. నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ ఏరియాల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. 2 ఏండ్లుగా కొత్త బస్టాండ్ ఏరియాలోని సిగ్నల్స్పని చేయట్లేదు.
ట్రాఫిక్ పై ఫోకస్ చేస్తున్నాం
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థపై ఫోకస్ చేశాం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైతే అధికారులు, సిబ్బంది కొరత ఉండదు. ట్రాఫిక్ కంట్రోల్పై స్థానిక అధికారులతో చర్చించా. మరికొందరు సిబ్బందిని నియమిస్తాం.
-రాజేశ్చంద్ర, కామారెడ్డి ఎస్పీ