- నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీపీ అంజనీకుమార్
హైదరాబాద్,వెలుగు: ట్యాంక్బండ్పై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తూ సీపీ అంజనీకుమార్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదివారం ట్యాంక్బండ్పైకి వచ్చే సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 5 గంటల పాటు వెహికల్స్ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు నిర్ధేశించిన ప్రాంతాల్లో తమ వెహికల్స్ పార్క్ చేయాలని సూచించారు. రాత్రి 10 గంటల తరువాత యధావిధిగా ట్రాఫిక్ కు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి ట్యాంక్బండ్పైకి వచ్చే వెహికల్స్ను ఇక్బాల్ మినార్, హిమాయత్నగర్ మీదుగా మళ్లిస్తారు.
కర్బాల మైదాన్ నుంచి వచ్చే ట్రాఫిక్ను సైలింగ్ క్లబ్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు.
డీబీఆర్ మిల్స్ నుంచి ట్యాంక్బండ్ పైకి వచ్చే వెహికల్స్ ను గోశాల నుంచి కవాడిగూడ, జబ్బర్ కాంప్లెక్స్, బైబిల్హౌజ్ మీదుగా మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ఓల్డ్ సెక్రటేరియట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు.
ట్యాంక్బండ్ను చూసేందుకు వచ్చే విజిటర్స్ తమ వెహికల్స్ను అంబేద్కర్ విగ్రహం నుంచి లేపాక్షి వరకు, డాక్టర్ కార్స్ పార్కింగ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్నగర్, సెక్రటేరియట్, సైలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్, బుద్ధభవన్ వెనుక, ఎన్టీఆర్ గ్రౌండ్స్ దగ్గర పార్క్ చేయాలి.