హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర విషాదంగా మారింది. అమీర్పేట సిస్టర్ నివేదిత ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఒక రోజు విహారయాత్ర నిమిత్తం ఆదిబట్ల పరిధిలోని వండల్లా పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ 8వ తరగతి విద్యార్థి వేలంగి దమ్రుఖ్ శివ సూర్య తేజ ఆటలు ఆడుతూ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు.
పార్కులోని మెడికల్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, వయసుకు మించిన ఆటలు ఆడించడం వల్లే ఈ ఘటన జరిగిందని అమీర్పేట స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
