
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు:సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలని, వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ఏరియాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రతి బస్ స్టేషన్ లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. 97 బస్ డిపోలు, 340 బస్ స్టేషన్లు సమన్వయం చేసుకొని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు.