ఘట్ కేసర్, వెలుగు: కూతురు ఉన్నత చదువు కోసం జస్ట్ డయల్ను సంప్రదించిన ఓ తండ్రి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ బి.రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ పంచాయతీ వైభవ్ కాలనీలో ఉండే వేణుగోపాల్ రెడ్డి గతేడాది డిసెంబర్ నెలలో ఎండీఎస్ చదువుతున్న కూతురు చదువు ఖర్చుల కోసం రూ.30 లక్షల లోన్ కావాలని జస్ట్ డయల్కు కాల్ చేశాడు. అదే నెలలో అమిత్ అగర్వాల్ అనే పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి.. తాను ఓ ప్రముఖ ఫైనాన్స్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు అడిగిన రూ.30 లక్షల రుణం కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.15 వేలు పంపించాలని కోరాడు.
దీంతో అతని అకౌంట్ కు వేణుగోపాల్రూ.15వేలు పంచించాడు. వెంటనే లోను మంజూరు లేఖను పంపించి ఇన్సూరెన్స్ చేయాలని, రూ. 47 వేల 500 కావాలని చెప్పగా నమ్మిన బాధితుడు మళ్లీ పంపించాడు. అంతటితో ఆగకుండా జీఎస్టీ కోసం రూ.75 వేలు కావాలని చెప్పుగా వెంటనే పంపించాడు. తర్వాత మరికొంత పంపించాలని అడగగా, అనుమానంతో వేణుగోపాల్విచారించగా అమిత్ అగర్వాల్ సైబర్ నేరగాడని తేలింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోచారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.