ప్రొటోకాల్పై టీఆర్ఎస్​, కాంగ్రెస్ లొల్లి

ప్రొటోకాల్పై టీఆర్ఎస్​, కాంగ్రెస్ లొల్లి

దండేపల్లి, వెలుగు:  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో సోమవారం టీఆర్ఎస్​, కాంగ్రెస్​ లీడర్లు కొట్టుకున్నారు. రెండు వర్గాలు నడిరోడ్డుపై కలబడడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగినప్పటికీ పరస్పరం కేసులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల మండలంలోని పాత మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు పాల్గొన్నారు. రూ.22 లక్షలతో మంజూరైన డైనింగ్ హాల్​నిర్మాణానికి భూమిపూజ చేశారు.  ఈ సందర్భంగా ప్రొటోకాల్​ విషయంలో లొల్లి జరిగింది. అప్పటినుంచి టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లీడర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఆదివారం సాయంత్రం ఇదే విషయంలో రెండు పార్టీల లీడర్లు మేదరిపేట బస్టాప్​ వద్ద బాహాబాహీకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలో జడ్పీటీసీ నాగమణి భర్త కాంగ్రెస్​ లీడర్​గడ్డం త్రిమూర్తితో పాటు పలువురు టీఆర్ఎస్​, కాంగ్రెస్ టీడర్లు గాయపడ్డారు. టీఆర్ఎస్​ లీడర్​ పత్తిపాక శ్రీనివాస్​ భార్య శ్రీలేఖ ఫిర్యాదుతో కాంగ్రెస్ ​లీడర్లు గడ్డం త్రిమూర్తి, కొట్ల మహేందర్, బత్తుల రమేశ్​లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. కాగా కొట్ల మహేందర్​ భార్య టీఆర్ఎస్​ లీడర్లపై కంప్లయింట్​ఇచ్చినట్టు తెలిసింది.