బీజేపీలోకి బాలాజీనగర్​ కార్పొరేటర్​ కావ్య

బీజేపీలోకి బాలాజీనగర్​ కార్పొరేటర్​ కావ్య

కూకట్​పల్లి, వెలుగు :  బాలాజీ నగర్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరీశ్​రెడ్డి దంపతులు బీజేపీలో చేరనున్నారు. ఈనెల 15వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ కె.లక్ష్మన్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు సమక్షంలో వారు పార్టీలో చేరుతారని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు,  కూకట్​పల్లి అసెంబ్లీ పార్టీ కన్వీనర్​ రవికుమార్​గౌడ్​  గురువారం మీడియా సమావేశంలో  తెలిపారు.   ఈ నెల 15న సాయంత్రం 4.30 గంటలకు  ఎన్​ గార్డెన్స్ లో జరిగే పార్టీ సమావేశంలో వారితో పాటు 2 వేల మంది బీజేపీలో చేరుతారని చెప్పారు.

గతంలోనూ బీజేపీలో  చురుకుగా..

కార్పొరేటర్​ కావ్య ఆమె భర్త హరీశ్​రెడ్డిలకు గతంలో బీజేపీతో అనుబంధం ఉంది. నిజామాబాద్​ జిల్లా వేల్పూరుకు చెందిన హరీశ్​రెడ్డికి ఏబీవీపీ నేతగా  గుర్తింపు ఉంది. నిజామాబాద్​ జిల్లాలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్​కు సన్నిహితుడిగా మెలిగారు.  కూకట్​పల్లిలో స్థిరపడ్డాక కూకట్​పల్లి మున్సిపాలిటీలో టీడీపీ నుంచి కౌన్సిలర్​గా గెలుపొందారు. కూకట్​పల్లి మున్సిపాలిటీ జీహెచ్​ఎంసీలో కలిసిన తర్వాత రెండు సార్లు కార్పొరేటర్​గా పోటీచేసి ఓడిపోయారు.  తదుపరి  కాంగ్రెస్​లో  ఆ తర్వాత టీఆర్​ఎస్​లో చేరారు.  2016లో జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తన భార్య కావ్యను బాలాజీనగర్​ డివిజన్​ నుంచి టీఆర్​ఎస్ ​కార్పొరేటర్​గా గెలిపించుకున్నారు. కూకట్​పల్లి అసెంబ్లీ సెగ్మెంట్​ స్థాయికి హరీశ్​రెడ్డి ఎదగడంతో  ఎమ్మెల్యే  మాధవరం కృష్ణారావుతో రాజకీయ వైరం పెరిగింది.  కూకట్​పల్లి సిట్టింగ్​ ఎమ్మెల్యేకే టీఆర్​ఎస్​ పార్టీ సీటు ఇవ్వడంతో హరీశ్​రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా పోటీచేశారు. కొన్ని నెలల పాటు సైలెన్స్​గా ఉన్న హరీశ్​రెడ్డి కార్పొరేటర్​ అయిన తన భార్య కావ్యతో పాటు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.