- నెక్లెస్ రోడ్లో వాకింగ్కు వెళ్లొస్తుండగా అడ్డుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి, ఇతర నేతలు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కాన్వాయ్పై టీఆర్ఎస్నేతలు దాడి చేశారు. కాన్వాయ్లోని కారును అడ్డుకుని అద్దాలు పగలగొట్టారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో జరిగిన ఈ ఘటన కలకలం రేకెత్తించింది. సోమవారం హైదరాబాద్లో పలు ఆలయాలను సందర్శించిన బండి సంజయ్.. సాయంత్రం నెక్లెస్ రోడ్ కు వెళ్లారు. వాకింగ్ చేసి.. అక్కడున్న పిల్లలతో సరదాగా ఆటలు ఆడారు. తర్వాత నెక్లెస్రోడ్డు నుంచి బయలుదేరారు. అప్పటికే నెక్లెస్రోడ్డుకు వచ్చిన టీఆర్ఎస్ ఖైరతాబాద్ క్యాండిడేట్ విజయారెడ్డి, ఆమె అనుచరులు సంజయ్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. సంజయ్ ఉన్నట్టుగా భావిస్తూ ఓ కారుపై దాడికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. కారులో ఉన్నవారిని బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులనూ తోసేశారు. బీజేపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానీ ఆ కాన్వాయ్లో సంజయ్ ఉన్న కారు అప్పటికే ముందుకు వెళ్లిపోయింది. చివరికి పోలీసులు విజయారెడ్డిని, టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు.
విజయారెడ్డి, కార్యకర్తలపై కేసు నమోదు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్పై హత్యాయత్నం అనే ప్రచారం అవాస్తవమని.. ఆయన కాన్వాయ్పై దాడి రాజకీయ పార్టీల గొడవ అని హైదరాబాద్ సెంట్రల్జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. సంజయ్ కాన్వాయ్పై టీఆర్ఎస్ దాడికి సంబంధించి.. విజయారెడ్డి, ఆమె అనుచరులపై రాంగోపాల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత విశ్వప్రసాద్ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సంజయ్ ఈవెనింగ్ వాక్ కోసం నెక్లెస్రోడ్డుకు వచ్చారని.. దీనిపై రాత్రి 8.30 సమయంలో తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రాంగోపాల్పేట పోలీసులు స్పాట్ కు వెళ్లి బండి సంజయ్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారని.. దానికి సంజయ్ అంగీకరించారని, అక్కడే ఉన్న రెస్టారెంట్ లో టిఫిన్ చేసి వెళ్తానని చెప్పారని వివరించారు. అదే సమయంలో కొందరు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి వచ్చారని.. ఇరు పార్టీల వాళ్ల మధ్య గొడవ మొదలైందని చెప్పారు. సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. కొందరు కారుపై దాడి చేసి, అద్దాలు పగలగొట్టారని వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.