ఎంపీ ఉత్తమ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్

ఎంపీ ఉత్తమ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్

నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్ విసిరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో 25 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన చరిత్ర ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిదే అని ఆరోపించారు. 

హుజుర్ నగర్ లో కాంగ్రెస్ నాయకులను ఎదగకుండా ఎంపీ ఉత్తమ్ చేశారని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకుని ఉత్తమ్ భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హుజుర్ నగర్ లో హత్య రాజకీయాలు చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉండి పేకాట క్లబ్ నడిపించిన చరిత్ర ఉత్తమ్ ది అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచేందుకు తీసుకుని వెళ్తూ..కార్లలో రూ.5 కోట్ల డబ్బులు తగలబడ్డాయని చెప్పారు.