ప్రపంచంలో అతిగొప్ప ప్రాజెక్ట్ గా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందని టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయుడు కేశవరావు అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో మీడీయాతో మాట్లాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ లున్న అమెరికా, ఈజిప్ట్ సరసన కాళేశ్వరం ప్రాజెక్ట్ తో భారత్ కూడా నిలిచిందని చెప్పారు. “ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ప్రాజెక్ట్ గా మేం భావిస్తున్నాం. రీడిజైన్ తో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఘనత సిఎం కేసీఆర్ దే. తెలంగాణకు, దేశానికి పండగ రోజు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలు తీరుతాయి. కాళేశ్వరం కేసీఆర్ ప్రాజెక్టు… క్రెడిట్ అంతా కేసీఆర్ దే. ముందుచూపుగా నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేశారు” అని కేశవరావు చెప్పారు.
పార్లమెంట్ ఉభయ సభల ప్రసంగంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ … భవిష్యత్ లో నీటి కష్టాలను ప్రస్తావించారని … సమస్యను ముందుగానే గుర్తించి సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేశారని లోక్ సభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని పైకి తీసుకెళ్ళడం మామూలు విషయం కాదన్నారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు,80 శాతం ప్రజలకు తాగునీరు,పరిశ్రమలకు కావలసిన నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుతుందన్నారు.