లోక్సభ ఎలక్షన్ల తెలంగాణ ఓటర్లు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన్రు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోష్ మీదున్న కారుకు బ్రేకులేసిన్రు. 16కు ఒక్కసీటు కూడా తగ్గబోమన్న టీఆర్ఎస్కు తొమ్మిది సీట్లే ఇచ్చి కూసోమన్నరు. అసెంబ్లీ రిజల్ట్స్తో డీలా పడ్డ ప్రతిపక్షాలకు హిమ్మత్ ఇచ్చిన్రు. బీజేపీని నాలుగు సీట్లల్ల, కాంగ్రెస్ను మూడు సీట్లల్ల గెలిపించిన్రు. సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. నినాదానికి చెక్ పెట్టిన్రు. ఫెడరల్ ఫ్రంట్ ఆశల మీద నీళ్లు జల్లిన్రు. నా ప్రతిరూపాలు అంటూ తెచ్చిన కొత్త మొఖాలను ఓడగొట్టిన్రు. మంత్రుల కొడుకులు, అల్లుళ్లకు చుక్కలు చూపిన్రు.
సారు కన్నబిడ్డకు, దగ్గరి చుట్టాలకు షాక్ ఇచ్చిన్రు. చెల్లని రూపాయిలన్నోళ్లనే చల్లగ చూసిన్రు. డెమోక్రసీలో అందరి వాయిస్ ఉండాలె అన్న మెసేజ్ ఇచ్చిన్రు. ఊహించని ఈ ఫలితాలతో టీఆర్ఎస్ లీడర్లు డీలా పడ్డరు. రిజల్ట్స్ షురూ కాగానే డప్పు చప్పుళ్లు, పటాకుల మోతలు, డ్యాన్సులతో కళకళలాడే తెలంగాణ భవన్ వెలవెలబోయింది. పెద్ద లీడర్లు ఎవ్వరు అటు వైపు కూడా తొంగి చూడలే. కాంగ్రెస్, బీజేపీ ఆఫీసులు సందడి సందడిగా మారినయి. పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ లీడర్లు సంబురాలు చేసుకున్నరు.