నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్​ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్​ వ్యూహం

నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్​ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్​ వ్యూహం
  • మునుగోడు ఎన్నికలు ముగిసినా ఆగని చేరికల పర్వం
  • ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్​ఓటు బ్యాంకు బీజేపీకి కలిసివస్తాయనే భయం 
  • చేరికల కోసమే నియోజకవర్గానికి రూ. 10 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం

నల్గొండ, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్​ క్యాడర్​ను లక్ష్యంగా చేసుకొని రూలింగ్​ పార్టీ ‘ఆపరేషన్​ గులాబీ’కి తెరతీసింది. మునుగోడు ఉప ఎన్నిక నేర్పిన గుణపాఠం, కోమటిరెడ్డి బ్రదర్స్ రూపంలో పొంచి ఉన్న​ భయంతో బీజేపీ కన్నా ముందే అప్రమత్తం కావాలని హైకమాండ్​ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇప్పటికే రంగంలోకి దిగారు. కాంగ్రెస్​ నుంచి లీడర్లు, క్యాడర్​ అనే తేడాలేకుండా ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి రూ.10 కోట్ల దాకా ఖర్చు పెడ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా మునుగోడు ఎన్నికల టైంలో మొదలైన ఈ చేరికల పర్వం కొద్దిరోజులుగా మళ్లీ స్పీడందుకున్నది. 

మునుగోడులో బెడిసికొట్టిన వ్యూహం

మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్​ఓటు బ్యాంకు తమకు కలిసొస్తుందని టీఆర్ఎస్​లీడర్లు ఆశించారు.  కానీ బీజేపీకి ఏకంగా 83 వేల ఓట్లు రావడంతో టీఆర్ఎస్​ కంగుతిన్నది. ఈ ఫలితాలపై లోతుగా విశ్లేషించిన పార్టీ హైకమాండ్.. వచ్చే ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్​ఓటు బ్యాంకు రెండూ బీజేపీకి తోడైతే కష్టాలు తప్పవని భావిస్తోంది. ఈక్రమంలోనే  కాంగ్రెస్​ లీడర్లు, ఓటర్లు బీజేపీ వైపు జారిపోకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్​వర్క్​గట్టిగా చేయాలని జిల్లాలో ఆదేశించింది.  రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్​ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు  తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదని భావిస్తున్న ఆలేరు, సూర్యాపేట, నల్గొండ, నకిరేకల్, కోదాడ, మునుగోడు, మిర్యాలగూడెం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారు. గులాబీ పార్టీలోకి వచ్చే కాంగ్రెస్​లీడర్లకు భారీ నజరానాలు ముట్టచెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో సొంత పార్టీలో అసంతృప్తులను చల్లబర్చేందుకు నామినేటెడ్​ పోస్టులు సైతం కట్టబెడుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో నకిరేకల్, తుంగతుర్తి, నల్గొండ, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన లీడర్లు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్​లో చేరారు. సర్పంచులు, ఎంపీటీసీలను ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్​నాయకులు మండిపడుతున్నా చేరికలు మాత్రం ఆగడం లేదు. పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. 

కోమటిరెడ్డి బ్రదర్స్​భయం  

టీఆర్ఎస్​ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి బ్రదర్స్​భయం కూడా పట్టుకుంది. రాజగోపాల్ రెడ్డి చరిష్మాతో మునుగోడులో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఎన్నికల నాటికి ఆయన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరితే ఇక టీఆర్ఎస్​కు కష్టకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రదర్స్​ఎఫెక్ట్​ ఎంతలేదన్నా ఆరేడు నియోజకవర్గాలపై ఉంటుంది. మొదట్లో బ్రదర్స్​టీఆర్ఎస్​లోకి రాకుండా నిలువరించడంలో జిల్లా ముఖ్యనేతలు సక్సెస్​ అయినప్పటికీ రాజకీయంగా ఎదుర్కోవడంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ భయంతోనే కోమటిరెడ్డి బ్రదర్స్​ముఖ్య అనుచరులు ఉన్న నియోజకవర్గాలపై ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. భారీ నజరానాలు, నామినేటెడ్​ పోస్టులు ఇప్పిస్తామని ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 

కమ్యూనిస్టులతో ఒరిగేది కొంతే..

మునుగోడులో కమ్యూనిస్టులతో పొత్తు వల్లే ఆ పదివేల ఓట్ల మెజార్టీ లభించిందనే అభిప్రాయం కొంత వరకు ఉంది. ఈ పొత్తులు వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశాలు ఉండొచ్చని చెబుతున్నారు. కాకపోతే కమ్యూనిస్టుల ప్రభావం అన్ని నియోజకవర్గాల్లో లేకపోవడం టీఆర్ఎస్​కు మైనస్. మరోవైపు పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటు అనివార్యమవుతుంది. దీనివల్ల టీఆర్ఎస్​కు ఒనగూరే లాభం కంటే నష్టం ఎక్కువనే అభి ప్రాయం పార్టీ నేతల్లో ఉంది. ఒకవేళ పొత్తులు కొలిక్కి వచ్చినా.. కాంగ్రెస్​ ఓటు బ్యాంకు చీల్చకుండా కేవలం కమ్యూనిస్టులనే నమ్ముకుంటే బీజేపీయే  లాభపడుతుందని పార్టీ సీనియర్​ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​ ఓట్లను చీల్చే ప్రక్రియ ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా కంట్రోల్​కి వస్తాయని ఆ ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం.