- కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్లో గట్టిపోటీ ఇచ్చిన ప్రతిపక్షాలు
- వరంగల్, ఖమ్మంలో స్పష్టమైన మెజారిటీ..
- క్లీన్ స్వీప్ అనుకున్న సిద్దిపేటలో రెబల్స్ షాక్
- ఇండిపెండెంట్లుగా పోటీచేసి 5 చోట్ల గెలుపు
- హైదరాబాద్ లోనిలింగోజిగూడ డివిజన్లో కాంగ్రెస్ గెలుపు
హైదరాబాద్, వెలుగు: మినీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎన్నికలు జరిగిన ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. కరోనా టైంలో ఎన్నికలు నిర్వహించి, ఓటింగ్ శాతం తగ్గేలా చేసిన అధికార పార్టీ.. వ్యతిరేక ఓటు పడకుండా చూసుకోవడంలో సక్సెస్ అయింది. ఇంత చేసినా.. మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు ప్రతిపక్ష పార్టీలు, రెబల్గా దిగి స్వతంత్రులుగా పోటీ చేసిన క్యాండిడేట్లు గట్టి పోటీనే ఇచ్చారు. కొత్తూరు, అచ్చంపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, నకిరేకల్ మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు చెమటలు పట్టించారు. క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న సిద్దిపేటలోనూ బీజేపీ, ఎంఐఎం ఒక్కో స్థానంలో గెలువగా, రెబల్గా బరిలోకి దిగిన స్వతంత్రులు ఐదు చోట్ల విజయం సాధించారు. టీఆర్ఎస్ 36 స్థానాల్లో గెలిచింది.
వరంగల్లో వరుసగా రెండోసారి
గ్రేటర్ వరంగల్లో వరుసగా రెండోసారి మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. 66 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 48 సీట్లు, బీజేపీ 10 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు గెలిచాయి. ఖమ్మం కార్పొరేషన్లోనూ టీఆర్ఎస్ 43 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 9 స్థానాలు, సీపీఐ 3, సీపీఎం 2, బీజేపీ ఒక స్థానంలో గెలిచాయి. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను టీఆర్ఎస్ 7 స్థానాలు గెలవగా, కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు స్థానాల్లో గెలుపొందారు. అచ్చంపేటలో 20 వార్డులకు టీఆర్ఎస్13 చోట్ల గెలవగా, కాంగ్రెస్ ఏడు, బీజేపీ ఒక స్థానంలో విజయాన్ని సాధించాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఒక్కో స్థానానికి జరిగిన ఎన్నికల్లో గజ్వేల్, నల్గొండ, బోధన్లో టీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలవగా, పరకాలలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
