ట్రంప్ హత్యకు కుట్ర కేసు..  కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ అరెస్ట్

ట్రంప్ హత్యకు కుట్ర కేసు..  కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ అరెస్ట్

అమెరికా దాడుల తర్వాత రాత్రికి రాత్రే పుట్టిన ‘కటాయిబ్ హిజ్బల్లా’ 
న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​ను హత్య చేయాలనే కుట్రతోపాటు యూరప్‌‌లో 18 ఉగ్రవాద దాడులకు ప్లాన్​ చేసిన కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ ‘కటాయిబ్ హిజ్బల్లా’ కమాండర్ మహ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాదీని అరెస్ట్ చేసినట్టు ఎఫ్​బీఐ వెల్లడించింది. అల్-సాదీని ఎఫ్​బీఐ అధికారులు శుక్రవారం మాన్‌‌హట్టన్ కోర్టులో హాజరుపర్చారు.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌‌పై దాడి చేసిన తర్వాత రాత్రికి రాత్రే ఆవిర్భవించిన కటాయిబ్ హిజ్బల్లా అనే టెర్రరిస్ట్ గ్రూప్​కు ఇరాకీ జాతీయుడు అల్-సాదీ కమాండర్​గా వ్యవహరించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇరాన్​కు చెందిన హియా (హరకత్ అషబ్ అల్-యామిన్ అల్-ఇస్లామియా) టెర్రరిస్ట్ సంస్థకు కటాయిబ్ హిజ్బల్లా సంస్థ  ప్రాక్సీ గ్రూప్​గా ఏర్పాటైందని గుర్తించామన్నారు.

‘ఇరాన్ సైనిక సంఘర్షణ ప్రారంభమైన తర్వాత వారాల్లోనే దాదాపు 20 దాడులను నిర్వహించడానికి హియా గ్రూప్ యూరప్ అంతటా టెర్రర్​ గ్రూపులను రాత్రికి రాత్రే యాక్టివ్ చేసింది’ అని అధికారులు చార్జ్ షీట్​లో పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 20న అల్-సాదీ అమెరికా అధ్యక్షుడిని బెదిరిస్తూ స్నాప్‌‌చాట్‌‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘‘అమెరికన్లకు విముక్తి కోసం ట్రంప్​ను చంపాలి. ఈ సందేశాన్ని మేం 
ప్రధానంగా అమెరికన్ భద్రతా సంస్థలు, సీక్రెట్ సర్వీస్, ఎప్‌‌స్టీన్ ఐలాండ్ బాధితులకు పంపుతున్నాం. ఎప్‌‌స్టీన్ ఐలాండ్ లో ఎన్నో కుటుంబాల రక్తం చిందింది. పిల్లల ప్రాణాలను తీశారు” అని పేర్కొన్నాడు.