అమెరికాలో టిక్టాక్ రీఎంట్రీ.. కొనేందుకు బయ్యర్లు దొరికారని ప్రకటించిన ట్రంప్

అమెరికాలో టిక్టాక్ రీఎంట్రీ.. కొనేందుకు బయ్యర్లు దొరికారని ప్రకటించిన ట్రంప్

అమెరికాలో బ్యాన్ అయిన టిక్టాక్ (TikTok) ఆ దేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిక్టాక్ను కొనేందుకు బయ్యర్లు దొరికారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ (FOX News) ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. టిక్ టాక్ను కొనడానికి ముందుకొచ్చిన ఆ బయ్యర్ల వివరాలను త్వరలో ప్రకటిస్తానని ట్రంప్ తెలిపారు. అయితే.. ఈ డీల్ ఓకే కావాలంటే చైనా ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రంప్ గుర్తుచేశారు. చైనా అధ్యక్షుడు ఈ ఒప్పందానికి సమ్మతి తెలుపుతారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఏప్రిల్‎లో జో బైడెన్ ప్రభుత్వం అమెరికాలో సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొత్త చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చట్టం ప్రకారం.. టిక్‌టాక్‌ను చైనా మాతృ సంస్థ బైట్‌డాన్స్ నుంచి అమెరికాకు విక్రయించాలి. లేదంటే టిక్ టాక్ అమెరికాలో నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. జో జోడైన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు టిక్‌టాక్‌ను చైనా మాతృ సంస్థ బైట్‌డాన్స్ విక్రయించేందుకు సిద్ధంగా లేకపోవడంతో 2025, జనవరి 19 నుంచి టిక్ టాక్ అమెరికాలో బ్యాన్ అయింది. అయితే.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక టిక్ టాక్ సేవలను పునరుద్ధరిస్తారనే వార్తలొచ్చాయి. తాజాగా.. ఈ వార్తలను నిజం చేస్తూ టిక్ టాక్ను కొనేందుకు బయ్యర్లు దొరికారని ట్రంప్ ప్రకటించడం గమనార్హం.

అమెరికా తీసుకొచ్చిన నిషేధ చట్టం అమలులోకి రావడంతో జనవరి 19, 2025 నుంచి తమ సేవలను అమెరికాలో నిలిపివేసినట్లు టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యూజర్లు యాప్ ఓపెన్ చేయగానే "దురదృష్టవశాత్తు యూఎస్లో టిక్ టాక్ నిషేధ చట్టం జనవరి 19 తేదీ నుంచి అమలులో కి వచ్చింది. ప్రస్తుతానికి మీరు టిక్ టాక్ను ఉపయోగించలేరు" అనే సందేశం స్క్రీన్పై వచ్చింది. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో సేవలను నిలిపి వేయడం తప్ప మరోమార్గం లేకుండా పోయిందని బైట్‌డాన్స్ వాపోయింది.