
- రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటమని వెల్లడి
న్యూయార్క్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై సెకండరీ టారిఫ్లు ఉండకపోవచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే.. దీనిపై వెంటనే కాకుండా రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ సెకండ్ ప్లేస్లో ఉందని తెలిపారు.
‘‘ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్పుతిన్ ఒక ఆయిల్ క్లయింట్ను కోల్పోయారు. ఆ క్లయింట్ ఇండియా. సుమారు 40 శాతం ఆయిల్ను రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడు ఆ కొనుగోళ్లను ఆపేసినట్లు తెలిసింది. మేం విధించే సెకండరీ టారిఫ్లు ఆయా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడాలని మేం ఆశిస్తున్నం. ఇండియాపై విధించిన టారిఫ్లు కూడా ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలకు దారితీశాయి.
ఇండియాపై సెకండరీ టారిఫ్లు అమలు చేయాలనుకుంటే చేయొచ్చు.. కానీ, అలా అమలు చేసే పరిస్థితి నాకు రాకపోవచ్చు” అని శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అలాస్కాలో పుతిన్తో భేటీకి ముందు ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. పుతిన్తో భేటీ అనంతరం కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెకండరీ టారిఫ్లపై రెండు మూడువారాల్లో సమీక్షిస్తామని తెలిపారు. పుతిన్, ట్రంప్ సమావేశం అనంతరం అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్.. బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ ఒప్పుకుంటే సెకండరీ టారిఫ్లు ఉండకపోవచ్చనని, ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్లు రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని చెప్పారు. కాగా, ప్రస్తుతం భారత్పై 50 శాతం టారిఫ్లను అమెరికా విధిస్తున్నది. ఇందులో రష్యా ఆయిల్ను ఇండియా కొనుగోలు చేస్తున్నదని చెప్పి 25 శాతం సెకండరీ టారిఫ్లను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని గత నెలలో ట్రంప్ ప్రకటించారు. అయితే.. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో 25 శాతం సెకండరీ టారిఫ్లకు బ్రేక్ పడే అవకాశం
ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.