
- టారిఫ్ అమలుపై స్టే విధించిన యూఎస్ ట్రేడ్ కోర్టు
- వాణిజ్య లోటును నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించడం చట్టవిరుద్ధం
- టారిఫ్లు విధించే పవర్ కాంగ్రెస్కే ఉందని వెల్లడి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యూఎస్ ట్రేడ్ కోర్టు షాక్ ఇచ్చింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై టారిఫ్లు విధించే అధికారం ప్రెసిడెంట్కు లేదని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితిలో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే పవర్ ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్రంప్ విధించిన టారిఫ్లపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్కే ఉందని జస్టిస్ జేన్ రెస్టాని, జస్టిస్ గ్యారీ కాట్జ్మన్, జస్టిస్ టిమోతీ రీఫ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
ట్రంప్ విధించిన టారిఫ్లను సవాల్ చేస్తూ.. అమెరికాలోని 5 ఇంపోర్ట్ కంపెనీలు, ఒరెగాన్ స్టేట్ అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై ట్రేడ్ కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ మేరకు ట్రంప్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కేవలం ఆర్థిక ఒత్తిడి సృష్టించడమే..
ట్రంప్ వాణిజ్య లోటును ‘నేషనల్ ఎమర్జెన్సీ’గా ప్రకటించడం చట్టవిరుద్ధమని ట్రేడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా.. గత 49 ఏండ్లుగా వాణిజ్య లోటును ఎదుర్కొంటోందని తెలిపింది. ఇది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ‘అసాధారణ, అత్యవసర బెదిరింపు’గా పరిగణించలేమని కోర్టు చెప్పింది. ‘‘చైనా, కెనడా, మెక్సికోపై ఫెంటానిల్ డ్రగ్ ట్రాఫికింగ్ను అరికట్టేందుకు విధించిన టారిఫ్లు కూడా చట్టవిరుద్ధం. ఈ టారిఫ్లు డ్రగ్ ట్రాఫికింగ్ సమస్యను నేరుగా పరిష్కరించలేవు. కేవలం ఆర్థిక ఒత్తిడి సృష్టించే ఉద్దేశ్యంతో విధించబడ్డాయి”అని కోర్టు తెలిపింది.
ప్రెసిడెంట్ టారిఫ్లు విధించొచ్చు: ప్రభుత్వం
అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్థించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రేడ్ కోర్టును అభ్యర్థించింది. ఈమేరకు తమ వాదనలు వినిపించింది. నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అసాధారణమైన, అత్యవసరమైన ముప్పులను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని ప్రభుత్వం తరఫు అడ్వకేట్ బెంచ్కు వివరించారు.
చట్టపరంగా ఎదురైన టారిఫ్ సవాల్.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, ఇండియా–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచుతుందని వాదించారు. టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరారు. అయితే, ట్రంప్ అడ్మిస్ట్రేషన్ వాదనలను కోర్టు తిరస్కరించింది. పది రోజుల వ్యవధిలోనే టారిఫ్లు నిలిపివేయాలని ఆదేశించింది.
పై కోర్టుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పీల్
టారిఫ్ అమలుపై ట్రేడ్ కోర్టు స్టే విధించడంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్లో అప్పీల్ దాఖలు చేసింది. వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ ట్రేడ్ కోర్టు తీర్పును ఖండించారు. వాణిజ్య లోటు.. అమెరికన్ కమ్యూనిటీలను నాశనం చేసిందని తెలిపారు. కార్మికుల అభివృద్ధిని వెనక్కి నెట్టేసిందని అన్నారు. రక్షణ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిని బలహీనపర్చిందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను ట్రేడ్ కోర్టు స్టే దెబ్బతీయొచ్చని తెలిపారు.