- ఇమ్మిగ్రేషన్ నిలిపేయాలని నిర్ణయం
- మనవాళ్లపై తీవ్ర ప్రభావం
వాషింగ్టన్: కరోనా వైరస్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి వచ్చేవారికి ఇమ్మిగ్రేషన్ను నిలిపేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జిగ్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ పౌరుల ఉద్యోగాలను రక్షించుకోవాలని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ అన్నారు. “ కనిపించని శత్రువు దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగులను రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే అమెరికాలో వలసల్ని టెంపరరీగా నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించిన ఎగ్జిగ్యూటివ్ ఆర్డర్స్పై నేను సంతకం చేయబోతున్నాను” అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తర్వులు జారీ అయితే వేరే దేశాల వారు ఉద్యోగాల కోసం అమెరికాలోకి ప్రవేశించలేరు. అమెరికాకు వలస వెళ్లే వారిలో మన దేశం, చైనాకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మనవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపనుంది. అమెరికాలో రోజు రోజుకు కరోనాతో చనిపోయే వారి సంఖ్యతో పాటు మరణించే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దాన్ని అరికట్టేందుకు కొద్ది రోజులుగా విధించిన షట్డౌన్ కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించి ఇబ్బందుల్లో పడటంతో చాలా మంది ఉద్యోగాలు ముప్పున పడ్డాయి. ఈ మేరకు ఇప్పటి వరకు దాదాపు 2.2కోట్ల మంది నిరుద్యోగ భృతికి అప్లై చేసుకున్నారని, ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.