- ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీనంటూ పరిచయాలు
- ముషీరాబాద్ ఎమ్మెల్యే, భద్రాచలం మాజీ ఎమ్మెల్యేల కుమారులపై ట్రాప్
- వాళ్ల ఫిర్యాదులతో నిందితుడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలు.. వీళ్లే అతడి టార్గెట్. జనాన్ని మోసం చేస్తే ఏమొస్తుందని అనుకున్నాడో ఏమో, ఏకంగా ప్రజాప్రతినిధులకే సూటి పెట్టాడు. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీనంటూ నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. చేసిన తప్పులు ఎప్పుడైనా బయటపడక తప్పదు కదా. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడి ఆట కట్టించి అరెస్ట్ చేశారు. ఆ వివరాలను జాయింట్ కమిషనర్ సీసీఎస్ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురానికి చెందిన తోట బాలాజీ నాయుడు (40) కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదివాడు. ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగమూ చేశాడు. కానీ, ఈజీ మనీ ఆలోచన వచ్చిన అతడు, ఏపీ, తెలంగాణ ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా అవతారమెత్తాడు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పేరిట మోసాలకు దిగాడు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ట్రాప్
తన మోసాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసుకున్నాడు బాలాజీ. పార్టీ కార్యాలయాల నుంచి వాళ్ల ఫోన్ నంబర్లను తీసుకున్నాడు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి పీఎంఈజీపీ పథకం కింద కోట్ల రూపాయలు మంజూరయ్యాయని నమ్మించేవాడు. అర్హులైన ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీ అభ్యర్థుల లిస్టును పంపించాల్సిందిగా చెప్పేవాడు. లిస్టు పంపాక, అభ్యర్థులకు లోన్ మంజూరు అయిందని, అవి విడుదల కావాలంటే 5 శాతం డబ్బును డిపాజిట్ చేయాలని నమ్మించేవాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 60 మంది ప్రజాప్రతినిధులను బాలాజీ మోసం చేశాడు. ఈ క్రమంలోనే ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు జయసింహను బాలాజీ ట్రాప్ చేశాడు. ఎప్పట్లాగే తాను ఆర్థిక శాఖ ఢిప్యూటీ సెక్రటరీ ఎ.మల్లారెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. సెక్రటేరియట్లోని డీ బ్లాక్ మూడో అంతస్తులో తన ఆఫీసు అని చెప్పాడు. ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీల లోన్ల కోసం దరఖాస్తు చేయాలని చెప్పి నమ్మించాడు. డాక్యుమెంట్లు పంపించాక లోన్ మంజూరుకు అందులో ఐదు శాతం జమ చేయాల్సిందిగా సూచించాడు. బాలాజీ చెప్పినట్టే జయసింహ ₹2.5 లక్షలను అతడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. మార్చి 1న ఆయా అభ్యర్థులను సెక్రటేరియట్లో మల్లారెడ్డిని కలవాల్సిందిగా చెప్పి పంపించారు జయసింహ. కానీ, అక్కడికి వెళితే ఆ పేరుతో ఎవరూ లేరని తేలింది. అక్కడే డీఈవోగా మల్లారెడ్డి పేరుతో ఇంకొకరున్నారని తెలుసుకున్నారు. దీంతో మార్చి 3న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు జయసింహ ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి కుమారుడు సంతోష్ కుమార్నూ బాలాజీ మోసం చేశాడు. ఆయనకు దాసరి అనిల్ కుమార్గా పరిచయమయ్యాడు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద ₹25 లక్షలు మంజూరు చేయిస్తానని, అందుకు ₹1.25 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించాడు. దీంతో మొదటి విడతగా సంతోష్ ₹50 వేలు పంపించారు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచాఫ్లో ఉండడంతో ఆరా తీస్తే, అసలు అనిల్ కుమార్ అనే వ్యక్తే లేరని తేలింది. మార్చి 2న ఆయన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరి ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.