రాష్ట్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. బేగంపేట్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మొత్తం 12 అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. FRBM చట్ట సవరణ, రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టేందుకు స్థానిక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసే తీర్మానాన్ని కేబినెట్ లో ఆమోదించనున్నట్లు సమాచారం.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, కొత్త పెన్షన్లు, పోడు భూముల సమస్యపై కేబినెట్ భేటీలో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై కూడా డిస్కస్ చేయనున్నట్లు సమాచారం. సొంత జాగా ఉన్న వారికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం, దళిత బంధు పథకాలపై చర్చ జరగనుంది. కేబినెట్ భేటీలో డీఏ చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా .... సెప్టెంబర్ 17 నుంచి ఏడాది పాటు తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించడంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాల విషయంలో సంబంధిత శాఖ మంత్రులు సిద్ధంగా ఉండేలా నివేదికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించే అవకాశముంది. మహిళా, ఫారెస్ట్ యూనివర్సిటీలతో పాటు.. ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు చెందిన చట్ట సవరణ బిల్లులు సైతం సభ ముందుకు రానున్నాయి.