తెలంగాణ ఎంసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతో ఎంసెట్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 17 వరకు గడువు పెంచుతున్నట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
ఎంసెట్కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. అందులో ఎంసెట్ ఇంజినీరింగ్కు 1,46,541, అగ్రికల్చర్కు 73,486 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ఏడాది మార్చి 18న అధికారులు ఎంసెట్ నోటిఫికేషన్ను విడుదల చేయగా.. కరోనా వ్యాప్తి కారణంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ఇప్పటివరకు ఎంసెట్ దరఖాస్తు గడువును మూడుసార్లు పొడిగించారు.
ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి జరుగుతాయని షెడ్యూల్ లో ప్రకటించారు. ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతుండటంతో.. దీనిపై మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.