
- 3.14 శాతం పెంచుతూ ఉత్తర్వులు
- 2.95 లక్షల మందికి లబ్ధి
- కిందటేడాది జులై 1 నుంచి అమల్లోకి..
- ఐఆర్, పీఆర్సీ కూడా ప్రకటించాలి: ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ పెంచింది. పెండింగ్లో ఉన్న రెండు డీఏల్లో ఒకటి క్లియర్ చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. 2018 జులై ఒకటి నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం 27.248 శాతంగా ఉన్న డీఏను 30.392 శాతానికి పెంచారు. దీంతో 2.95 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 20 వేల మంది స్థానిక సంస్థలు, ఎయిడెడ్, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్, 2015లో వేతన సవరణ పొందిన రెగ్యులర్ సిబ్బందికి డీఏ పెంపు వర్తించనుంది. పెన్షనర్లకు కూడా 3.14 శాతం డీఆర్ (కరువు భతి) పెంచారు. దీంతో 2.45 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెరిగిన డీఏ ప్రకారం జూన్ నెల డబ్బులను జులై వేతనంలో జమ చేస్తారు. 2018 జులై ఒకటో తేదీ నుంచి 2019 మే 31 వరకు11 నెలల బకాయిలను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో జమ చేస్తారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుతో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు నగదు రూపంలో బకాయిలు చెల్లిస్తామని, వారు సర్వీస్లో చివరి నాలుగు నెలలకు పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇస్తామని తెలిపింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులు (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిధిలోని వారు) ఉద్యోగుల కరువు భత్యంలో 90 శాతం మొత్తాన్ని నగదు రూపంలో వారి జులై నెల వేతనంతో పాటు జమ చేస్తారు. జీపీఎఫ్ పరిధిలోని కాంటిజెంట్ ఉద్యోగుల బకాయిలను కూడా జులై నెల వేతనంతో పాటు నగదు రూపంలో చెల్లిస్తారు. పెన్షనర్లకు సంబంధించి సవరించిన పెన్షన్ రూల్స్ ఆధారంగా బకాయిలు చెల్లింపు ఉంటుందని ఉత్తర్వుల్లో వివరించారు.
2006లో సవరించిన యూజీసీ పేస్కేల్స్ ప్రకారం వర్సిటీ ఉద్యోగుల డీఏను 142 శాతం నుంచి 148 శాతానికి పెంచారు. 2010లో వేతన సవరణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 107.856 శాతం నుంచి 112.992 శాతం పెంచారు. ఈ లెక్కన స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న కాంటిజెంట్ ఉద్యోగుల రెమ్యునరేషన్ను రూ.3,850 నుంచి రూ.6,700లకు పెంచారు. పార్ట్ టైం అసిస్టెంట్లు, వీఆర్ఏల ఏడీ-హెచ్వోసీని నెలకు రూ.వంద చొప్పున పెంచారు.
ధన్యవాదాలు
ఒక విడత డీఏ మంజూరు చేసిన సీఎంకేసీఆర్కు ధన్యవాదాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డీఏ విడుదల చేయడం సంతోషకరం.- కారం రవీందర్రెడ్డి , మామిళ్ల రాజేందర్,టీఎన్జీవో కేం ద్ర సంఘం
ఇంకో డీఏ, ఐఆర్ రిలీజ్ చేయాలి
డీఏ ప్రకటిం చడంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా డీఏ ప్రకటన ఆలస్యమైంది . ఇంకో డీఏతో పాటు ఐఆర్ వెంటనే రిలీజ్ చేయాలి.- వి.మమత, టీజీవో అధ్యక్షురాలు
పీఆర్సీ ప్రకటిం చాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగాఎదురు చూస్తున్న పీఆర్సీని వెంటనే ప్రకటిం చాలి. మరో డీఏ పెండింగ్ ఉంది. ఐఆర్ ఇస్తారని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కోడ్ త్వరలో ముగుస్తున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలి.- పద్మాచారి, అధ్యక్షుడు,తెలంగాణ ఉద్యోగుల సంఘం