
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారి జాబితాను ఈ నెల 30 నుంచి వెబ్సైట్లో ఉంచనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. అయితే కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలున్నాయి. అయితే బోర్డు మాత్రం తాము నిర్ధారించుకున్న జవాబుల ప్రకారం మార్కులు వేసి ఫలితాలు వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లను పరిశీలించిన కోర్టు బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేయడం ద్వారా మరికొందరు అభ్యర్థులు పార్ట్-2కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇలా అదనంగా దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యే అభ్యర్థుల వివరాలను రేపట్నుంచి వెబ్సైట్లో పెట్టనున్నట్లు బోర్డు తెలిపింది.