ఆగస్టు 7, 8న గ్రూప్​ 2 ఎగ్జామ్స్​  .. షెడ్యూల్​ విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ

ఆగస్టు 7, 8న గ్రూప్​ 2  ఎగ్జామ్స్​  .. షెడ్యూల్​ విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ
  • అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్
  • నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్​ 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్స్​తో పాటు గ్రూప్ 2,  గ్రూప్ 3 పరీక్షల తేదీలను టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు కమిషన్​ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష, నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్3 ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు కమిషన్​ ప్రకటించింది. తాజాగా అక్టోబర్ 21 నుంచి  గ్రూప్1 మెయిన్స్ ఉంటాయని వెల్లడించింది.

  ప్రతీ పరీక్షకు మధ్య గ్యాప్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. కాగా, 2022లో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదలైనా ఇప్పటి వరకూ పరీక్ష నిర్వహించలేదు. ఇదే విషయమై ‘గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్  ఇంకెన్నడు?’ శీర్షికతో వారం క్రితం ‘వెలుగు’లో ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై సర్కారు, టీఎస్​పీఎస్సీ స్పందించింది. ఈ క్రమంలోనే కొత్త తేదీలను కమిషన్​ ప్రకటించింది. గ్రూప్స్​ పరీక్షల తేదీలను టీఎస్​పీఎస్సీ ప్రకటించడంపై నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 

గ్రూప్-​2 పరీక్ష తేదీలు.. ఇది నాలుగోసారి

రాష్ట్రంలో  783 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ 2022 డిసెంబర్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్​ను విడుదల చేయగా, 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్​పీఎస్సీ  ప్రకటించినా, ఆ తర్వాత వాయిదాపడింది. అనంతరం నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తామని కమిషన్​ ప్రకటించినా, అప్పుడూ అసెంబ్లీ ఎన్నికలతో పరీక్షలు పోస్ట్​పోన్​ అయ్యాయి.  ఆ తర్వాత  జనవరి  6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన కమిషన్​ మూడోసారి కూడా వాయిదా వేసింది.  తాజాగా, నాలుగోసారి ఆగస్టు 6,7 తేదీల్లో గ్రూప్​ 2 నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.​ 

14  నెలల తర్వాత గ్రూప్-​3 పరీక్ష తేదీలు

రాష్ట్రంలో1,363 గ్రూప్​ 3 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత మరిన్ని పోస్టులను కలిపి మొత్తం 1,388  గ్రూప్​ 3 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, పరీక్షా తేదీని మాత్రం ప్రకటించలేదు. కొత్త కమిషన్ వచ్చిన తర్వాత తాజాగా  నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ పెడతామని వెల్లడించింది. అంటే నోటిఫికేషన్ రిలీజైన సుమారు 14 నెలల తర్వాత గ్రూప్ 3 పరీక్షా తేదీలు ప్రకటించడం గమనార్హం.