భక్తులకు శుభవార్త.. ఇంటికే మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదం

భక్తులకు శుభవార్త.. ఇంటికే మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదం

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్‌టీసీ) శుభవార్త చెప్పింది. ఇంటికే మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదం చేరవేస్తామని తెలిపింది. గతంలో మాదిరి ఈసారి సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవలను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందజేయనున్నారు.  

మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుండగా.. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదం కోసం భక్తులు బుకింగ్‌ చేసుకోవచ్చు. అందుకోసం భక్తులు రూ.299 చెల్లించాలి. సమీపంలోని టీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పేటీఎం ఇన్‌‌సైడర్‌ యాప్‌ ద్వారానూ అమ్మవార్ల ప్రసాదాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలు తప్పనిసరిగా నమోదుచేయాలి. మరిన్ని పూర్తి వివరాలకు టీఎస్ఆర్‌టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040-69440000, 040-23450033ను సంప్రదించవచ్చు.