ఆర్టీసీ పార్శిళ్ల హోం పికప్ డోర్​ డెలివరీ షురూ : సజ్జనార్

ఆర్టీసీ పార్శిళ్ల హోం పికప్ డోర్​ డెలివరీ షురూ : సజ్జనార్
  • ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలను మరింత విస్తరిస్తాం
  • సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​సజ్జనార్ వెల్లడి
  • దిల్‌‌సుఖ్‌‌ నగర్‌‌లో కొత్త లాజిస్టిక్స్‌‌ కౌంటర్‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు :  టీఎస్ ​ఆర్టీసీ లాజిస్టిక్స్​సేవలను మరింత విస్తరిస్తామని సంస్థ మేనేజింగ్​డైరెక్టర్ సజ్జనార్​ తెలిపారు. త్వరలో ఆర్టీసీ తరఫున అనేక పథకాలు రాబోతున్నాయని చెప్పారు. ముఖ్యంగా పార్శిళ్లు డోర్​డెలివరీ, హోం పికప్ ప్లాన్​చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్టీసీ ఆదాయం పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా లాజిస్టిక్స్‌‌ వింగ్ నెట్‌‌వర్క్‌‌ను మరింతగా విస్తరిస్తున్నామని సజ్జనార్​తెలిపారు.

దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌ బస్​స్టేషన్​ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్‌‌ మోడల్‌‌ కౌంటర్‌‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఓ పార్శిల్​ను బుక్​చేసిన శివ కుమార్‌‌ అనే వినియోగదారుడికి రశీదు అందజేశారు. అనంతరం లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్‌‌, డెలివరీ కోసం ఏర్పాటు చేసిన కొత్త వెహికల్​ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్‌‌ ఆర్టీసీ లాజిస్టిక్స్‌‌ విభాగం తెలంగాణలో ఫాస్ట్​గా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అన్నారు. రోజూ సగటున15 వేల పార్శిళ్లను డెలివరీ చేస్తున్నామని తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శిళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామని వెల్లడించారు. కేవలం పార్శిళ్ల రవాణాతోనే సంస్థకు రూ.120 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ‘‘టీఎస్​ఆర్టీసీకి బస్​టికెట్ల నుంచి 97 శాతం ఆదాయం వస్తుండగా.. ఇతర సేవల ద్వారా 3 శాతమే వస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయం పెంచాలని టార్గెట్​గా పెట్టుకున్నాం.

ప్రైవేట్‌‌ మార్కెట్‌‌కు ధీటుగా లాజిస్టిక్స్‌‌ విభాగాన్ని బలోపేతం చేస్తున్నాం. అందులో భాగంగానే దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌ బస్‌‌ స్టేషన్‌‌ లో మోడల్‌‌ కౌంటర్‌‌ను ప్రారంభించాం. త్వరలో ఇలాంటి కౌంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నాం. లాజిస్టిక్స్‌‌ తోపాటు పెట్రోల్‌‌ బంక్‌‌ల ఏర్పాటు, జీవా వాటర్‌‌ బాటిళ్లను అందుబాటులోకి తీసుకురావడం, బస్‌‌ స్టేషన్లలో స్టాళ్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌ ప్రాంతంలో పార్శిళ్ల హోం పికప్, డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తాం.”అని సజ్జనార్​తెలిపారు.

సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం 040-69440069కు కాల్​చేయొచ్చని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ సీఓఓ డాక్టర్ వి.రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సీటీఎం(కమర్షియల్‌‌) శ్రీధర్‌‌, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం(లాజిస్టిక్స్) సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.