
వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతున్న క్రమంలో కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తుతున్నారు భక్తులు. శ్రీవారి దర్శనానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. అయితే.. క్యూ లైన్లలో సదుపాయాలు సరిగ్గా లేవంటూ భక్తులు నిరసనకు దిగడం చర్చనీయాంశం అయ్యింది.. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.అర్దరాత్రి క్యూలైన్లలో తనిఖీ చేశారు ఈఓ వెంకయ్య చౌదరి..భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. బయట క్యూలైన్ల దగ్గర అదనంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది టీటీడీ.. ఈ కేంద్రాలకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపుతున్నారు అధికారులు.
ఈ మేరకు భక్తులకు ఎప్పుడు, ఎక్కడ ఎంతమేర అన్నప్రసాదం సరఫరా చేశారో కూడా వివరాలు తెలుసుకుంటున్నారు టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి. భక్తులు టిటిడికి సహకరించి ఓపిగ్గా శ్రీవారిని దర్శించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. మరోవైపు వేసవి సెలవులు మరో పది రోజుల్లో ముగియనుండటం, వీకెండ్ కావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఈ మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. శిలా తోరణం వరకు క్యూలైన్ ఉంది. తిరుమలలోని ఆలయ పరిసరాలు, గదులు కేటాయించే సీఆర్వో, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.
Also Read : పవన్ దెబ్బకు దిగొస్తోన్న థియేటర్ యజమానులు
దీంతో ఉచిత సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటలు, రూ. 300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శుక్రవారం తిరుమల శ్రీవారిని 71 వేల721 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36 వేల 011 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.ఇటీవల వీకెండ్ లో భక్తుల సంఖ్య 90 వేలకుపైగా ఉండగా, మిగిలిన రోజులలో ఇది 70 వేల నుంచి 80 వేల మధ్య ఉంటోందని తెలిపారు అధికారులు.