పవన్ దెబ్బకు దిగొస్తోన్న థియేటర్ యజమానులు.. సినిమా హాళ్లలో తినుబండారాలపై ధరలు తగ్గింపు..!

పవన్ దెబ్బకు దిగొస్తోన్న థియేటర్ యజమానులు.. సినిమా హాళ్లలో తినుబండారాలపై ధరలు తగ్గింపు..!

అమరావతి: ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్స్, మాల్స్‎లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధికారుల తనిఖీల ఎఫెక్ట్ థియేటర్లపై భారీగా పడింది. తనిఖీల దెబ్బకు థియేటర్లు, మల్టీప్లెక్స్ యజమానులు దిగొస్తున్నారు. ఆహార పదార్థాల ధరలపై 10-20 శాతం వరకు తగ్గించారు. 

వరుసగా రెండు రోజుల పాటు థియేటర్లలో ముమ్మర తనిఖీలు చేపట్టిన అధికారులు.. క్యాంటిన్లలో తినుబండారులు అధిక ధరలకు అమ్ముతున్న థియేటర్లకు నోటీసులిచ్చారు. ధరలపై నియంత్రణ లేకపోతే చర్యలు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల తనిఖీలు.. ధరలు ఎక్కువ ఉంటే నోటీసులు ఇస్తుండటంతో చేసేదేమి లేక థియేటర్లు, మల్టీప్లెక్స్ యజమానులు ధరలు తగ్గిస్తున్నారు. 

►ALSO READ | Good News : జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత డబ్బులు వేస్తాం : సీఎం చంద్రబాబు

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. 2025, జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేస్తామని ఫిల్మ్ ఎగ్జిబిటర్లు ప్రకటించారు. పవన్ సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేస్తామడం వెనక కుట్ర ఉందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. 

దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గుత్తాధిపత్యం నడుస్తోందని.. థియేటర్లలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పవన్ ఆదేశాలతో సంబంధింత అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.