బషీర్బాగ్, వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ రూ.35.19 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్లోని టీటీడీ ఆలయ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు శంకర్గౌడ్ తెలిపారు. హిమాయత్నగర్లోని టీటీడీ ఆలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. టీటీడీ మంజూరు చేసిన నిధులతో కొండగట్టులో 96 గదులతో ధర్మశాల, దీక్షామండపం నిర్మిస్తామని చెప్పారు.
ఈ పనులను జనవరి 3న ప్రారంభిస్తామని, శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హిమాయత్నగర్ టీటీడీ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
