అణచివేయబడిన కులాల్లో అచలతత్వకవి.. మట్టి నుంచి మహిమల వరకు..

అణచివేయబడిన కులాల్లో అచలతత్వకవి.. మట్టి నుంచి మహిమల వరకు..

భారతదేశంలో ‘ప్రాచీన సంస్కృతి’ ఉందని అందరూ చెబుతుంటారు. దానికి కారణం ‘అలౌకికమైన’ మార్గంలో మన ఋషిపరంపర నడవడమే. మనిషి తన చివరి గమ్యమైన సత్యాన్ని తెలుసుకోవడం మన శాస్త్రాల సారాంశం. కొందరు ప్రసిద్ధి పొందిన పీఠాలు, మఠాలు శాస్త్రీయంగా, క్రమ బద్ధంగా వేదాంత విజ్ఞానాన్ని సమాజంలోకి తీసుకెళ్లేవారు.  మరికొందరు అదే వేదాంతాన్ని సామాన్యులకు చేరువ చేసేందుకు ప్రయత్నించారు. 

ముఖ్యంగామధ్యయుగంలో అలాంటి మహాత్ములు ఎందరో జన్మించారు. ఆళ్వార్లు, నయనార్లు 6వ శతాబ్దానికి ముందే తమిళ ప్రాంతంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తే 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడు సామాన్యుల భాషలో మతప్రచారం చేశాడు. అన్ని కులాల వారిని తన ‘అనుభవమంటపం’లో కూర్చో బెట్టి ఆధ్యాత్మిక సామాజిక పరిజ్ఞానం కల్పించాడు. ముఖ్యంగా, శూద్ర, దళిత వర్గాల నుంచి కూడా అనేకమంది మహాత్మా బసవేశ్వరుడి అనుయాయులుగా మారారు. 

ఆ పరంపర అలాగే కొనసాగి తెలుగు ప్రాంతంలో పోతులూరి వీరబ్ర-హ్మేంద్ర స్వామి, వేమన, శివరామదీక్షితులు, భాగవతుల కృష్ణప్రభువు వంటి వారు ఆధ్యాత్మిక విషయాలను ‘పామర సంస్కృతం’లోకి తీసుకొచ్చారు. ఇదంతా ఆధునిక పరిశోధకులకు పట్టని సంస్కరణా దృక్పథం. దాని కొనసాగింపుగా తెలంగాణ ప్రాంతంలో ఓ మహాయోగి, తత్వకవి జన్మించాడు. ఆయనే దున్న ఇద్దాసు. 


నల్గొండ జిల్లా చింతపల్లిలో క్రీ.శ 1811లో ఎల్లమ్మ, దున్న రామయ్య దంపతులకు ఇదన్న జన్మించాడు. అతను పెద్దయ్యాక పెద్ద రైతుల దగ్గర జీతానికి కుదిరాడు. ఆ కాలంలో జీతగాళ్లు మోటకొట్టడం, పశువులను మేపడం, దున్నడం లాంటి పనులు చేసేవాళ్లు. అలాగే ఇదన్న అన్ని పనులు చేస్తూనే సంత్‌‌‌‌ రయిదాసులా ఇంటి దగ్గర చెప్పులు కుట్టడం, మోట బొక్కెనలు, దండెడలు, తాళ్లు, మోకులు పేనడం చేసేవాడు. అయితే.. ఇదన్న మోటకొట్టే బావి దగ్గరకు తరచుగా ముగ్గురు సాధువులు  వస్తుండేవారు. ఓసారి ఇదన్న వాళ్లను అనుసరిస్తే వాళ్లు వెళ్లి ఓ శివాలయంలో ‘నామ సంకీర్తన’ చేస్తున్నారు. తర్వాత వాళ్లను కలిస్తే వాళ్లు ఇదన్న శ్రద్ధను గమనించి అతడిని ఆధ్యాత్మిక  మార్గంలోకి నడిపించారు. 

ఇదన్న మెల్లమెల్లగా ‘తత్వచింతన’ మొదలుపెట్టాడు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడైన జంగం బసవయ్య ఇదన్నకు  లింగధారణ చేయించి ‘పంచాక్షరి’ ఉపదేశించాడు. ఆ తర్వాత కాలంలో పంచాక్షరి జపంతో యోగసాధన, విచారణ మార్గం ద్వారా జ్ఞాన సాధన చేసి తన భావాలకు అక్షరరూపం ఇచ్చి తత్వకవిగా మారాడు. అలాగే గొప్ప ఆధ్యాత్మికవేత్తగా అనేక మహిమలు ప్రదర్శించాడు. మార్మికభాషలో తత్వకీర్తనలు రచించి దున్న ఇద్దాసుగా మారిపోయాడు. అలాగే అతని పూజలు, ఉపదేశాల ద్వారా కులాలకు అతీతంగా ఇద్దాసుకు ఎందరో శిష్యులయ్యారు. ఇద్దాసు నల్గొండలో జన్మించినా పాత పాలమూరు జిల్లా కొల్లాపురం వరకు అతని ప్రభావం పరివ్యాప్తిచెందింది. ఆ కాలంలో ఎందరో పటేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులై ఆయన మార్గంలో నడిచారు. ఆరోగ్యం, ఐశ్వర్యం మొదలైన భౌతిక సంపదలతో పాటు అలౌకికమైన ఆత్మజ్ఞానాన్ని జనానికి అందించాడు. అందువల్లనే ప్రముఖ పరిశోధకులు డాక్టర్‌‌‌‌‌‌‌‌ బిరుదురాజు రామరాజు ఇద్దాసును ‘మాదిగ మహా యోగి’ అని పిలిచాడు. 

ప్రస్తుతం దున్న ఇద్దాసు రాసిన 31 తత్వాలు, 12 మేల్కొల్పులు, 5 మంగళహారతులు లభిస్తున్నాయి. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన పి. మహేంద్రనాథ్ ఆయన సాహిత్యాన్ని రక్షిస్తే ఇటీవల కాలంలో (2018) దున్న విశ్వనాథం, వనపట్ల సుబ్బయ్య, దినకర్‌‌‌‌‌‌‌‌ల శ్రమతో తెలంగాణ ‘వికాస సమితి’ వీటిని ప్రచురించింది. 

దున్న ఇద్దాసు ఈ మార్గంలోకి వచ్చేనాటికే కులవివక్ష  కోరలు చాస్తున్నది. అందుకు ఎదురీది ఇద్దాసు అందరికీ పూజ్యనీయుడు కావడం కొందరు జీర్ణిం-చుకోలేకపోయారు. దళిత కులస్తుడైన ఇద్దాసుకు బోధనాధికారం లేదని కస్సుబుస్సుమన్నారు. దానికి ఇద్దాసు వేదాంత పరిభాషలోనే సమాధానం చెప్పారు.

మీరయ్యవారా? 
బ్రహ్మమూగన్న వారయ్యగారూ
గజరాజుకు మారు గ్రామ సూకరిబుట్టి 
గ్రామ శుద్ధి చేసి గజము వేనటి మేటి
దానితో మారు మాటాడు తెలియని 
వారు దానంతవారూ ...  || మీర|| 
కామధేనువు మారు కడగోవు జన్మించి 
మూతి వంచుకొని పూరి భక్షించేటి 
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ  || మీర||

అంటూ తన మనసులో భావాన్ని గట్టి ఉపమానాలతో అవతలివాళ్లకు అర్థమయ్యేలా చేశాడు. ఇద్దాసు గొప్పతనం ఇక్కడే బయ-టపడుతుంది. కులం విషయంలో ‘సంఘర్షణ’ విధానం కాకుండా ఇద్దాసు ‘సమన్వయం’ సాధించేందుకు ప్రయత్నించాడు. ఎందుకంటే ఇద్దాసు స్థితిగతులకు, కులాలకు అతీతంగా ఆనాడు సమాజంలోని చాలామంది పెద్దలనుకునే వారి మనస్సు జయించాడు. ఎల్లమ్మ భువనేశ్వరం (పీఠం) ఇళ్లల్లోకి తీసుకెళ్లి, పూజలు చేసి ప్రజల కష్టనష్టాలను తీర్చే గురువుగా ఇద్దాసుకు పేరు ఉంది. ఆయనకు ‘మాతంగి’ దర్శనం అయ్యిందని చెప్తారు.

 ‘మాతంగకన్యం మంజుల వాగ్విలాసినీం’ అని సరస్వతిని కాళిదాసు కూడా ప్రార్థించాడు. ఆమె వాక్‌‌‌‌శక్తి. అందుకే తత్వ కవిగా, యోగిగా పూజలందుకున్నాడు. అందువల్ల అతడు కులాన్ని సమన్వయంతో జయించి ‘సామాజిక సమరసత’ సాధించాడు.
ఇద్దాసు కాలంలో తెలంగాణ అసఫ్​జాహీల పాలనలో ఉంది. ఆ కాలంలో గ్రామ రెవిన్యూ వారు మొదలుకొని సామాన్యుల వరకు ఉర్దూ పదాలు ఉపయోగించి తెలుగు మాట్లాడేవారు. ఇద్దాసు తన తత్వాల్లో కూడా అక్కడక్కడ ఉపయోగించాడు. అలాగే మార్మిక తత్వాలలో వేదాంత పారిభాషిక పదాలను ఉపయోగించాడు.

‘‘ఆరు పూవుల తోటోయమ్మ! ఈ తోట లోపల 
పదహారు లొట్టి పిట్టలు గలవే సుమ్మా 
కరణాలు నలుగురు కాపులార్గురు 
ఘనముగ తోటకు కావలి యిద్దరు..
అష్టాగజములు ఎనిమిదమ్మ ఈ తోట లోపల 
ఇష్టా సంపన్నుడొక్కడే సుమ్మా 
ముప్పది ముగ్గురు ముసద్రీలు
నలభై నలుగురు నదరు వ్రాసెదరు 
ఇప్పుడు కచ్చీరు ఎడతెగకున్నది...
ముసద్రీలు, నదరు, కచ్చీరు వంటి పదాలు కనిపిస్తాయి . ఒకతత్వ గీతంలో ‘వేదాంతం’ నిక్షిప్తం చేయడం ఇద్దాసు జ్ఞానానికి గీటురాయి.
ఎంతో సంతోష కరమోయమ్మా! ఈ తోట లోపలి
వింతలెవరికి తెలియవు సుమ్మా!

తోటలోపల వింతలు మనిషి స్వభావం. ఆ స్వభావం వెనుక  ఏమేమి ఉన్నాయో ఇద్దాసు ‘మార్మిక భాష’లో చెప్తున్నాడు.
ఆరు పూవుల తోట అంటే షట్​చక్రాలు. మనిషి సూక్ష్మశరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయని యోగశాస్త్రాలు చెప్తున్నాయి. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరక, అనాహత, ఆజ్ఞా.. సహస్రారచక్రాల ఆధారంగా ‘సూక్ష్మశరీరం’ నడుస్తోందని భావం. ఈ తోటలో ‘లొట్టి పిట్ట’లు పదహారు అన్నాడు. ఇవి షోడశకళలు. నలుగురు కరణాలు అనగా మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే అంతః కరణాలు. కాపులు ఆర్గురు అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహం అనే అరిషడ్వర్గాలు. ముందుకు వెళ్లకుండా కాపు కాస్తుంటాయి. ఆ తోటకు ఇద్దరు కావలికార్లు అంటే గురువు, దైవం. అలాగే అష్టగజములు అనగా అష్టమదములు. ఈ తోట లోపల ఇష్టసంపన్నుడు అనగా చైతన్యుడు. ముప్ఫై మూడు మంది ముసద్రీలు అనగా ముప్ఫై మూడు కోట్ల దేవతలు. ఇక్కడ కోటి అనగా సమూహం. అష్ట వసువులు(08), ఏకాదశరుద్రులు(11), ద్వాదశాదిత్యులు(12), అశ్వనీదేవతలు(02) ఈ సమూహాన్నే ముప్ఫై మూడు కోట్ల దేవతలుగా అభివర్ణించారని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఇప్పుడు‘కచ్చీరు’ ఎడతెగక పోవడం అంటే ‘జననమరణ చక్రం’ అని అర్థం. ‘ఈ తోట లోపల మర్మమెల్ల తేటతెల్లగా తెల్పెనమ్మ” అంటూ ఈ సాంఖ్య బోధ చేసిన తన గురువు పెనుగొండ బసవ గురుడని చెప్పుకున్నాడు.

ఇలా ఇద్దాసు అనేక కోణాలను తన తత్వాల్లో చెప్పాడు. ప్రతీ తత్వాన్ని ఇలా వేదాంత, వైజ్ఞానిక దృష్టితో విశ్లేషణ చేయవచ్చు. చెప్పినవి పిడికెడన్ని తత్వాలే అయినా ఇద్దాసు వాటిలో  ‘వేదాంతసారం’ నింపిపెట్టాడు. అయితే..  ఎంత వేదాంతం చెప్పినా అందులో కవిత్వం లేకపోతే మనసుకు పట్టదు. అందువల్ల వేదాంతాన్ని కవిత్వీకరించిన రసహృదయుడు ఇద్దాసు. 

దళిత ఉద్యమాలను అనేక దృక్కోణాల్లో చూస్తున్న ఈ కాలంలో దేశంలోని దళిత తత్వవేత్తలైన తిరుప్పాణి ఆళ్వారు,  ఘాసిదాస్, హరిదాస్, రవిదాస్ సరసన నిలవదగిన ఇద్దాసు తెలంగాణ తొలి దళితకవి కావడం గమనార్హం. ఇప్పుడు ఆయన భావాలను, ఆలోచనలను, ఆధ్యాత్మిక జీవనాన్ని విడిచిపెట్టి దళిత ఉద్యమాలను పరిశోధించడం పాక్షిక సత్యమే అవుతుంది. ఇద్దాసు తన జీవితాన్ని ‘రెబల్’గా, వర్గవాదిగా కాకుండా ‘సమన్వయవాది’గా మలచుకోవడం అతని సమదృష్టికి నిదర్శనం. 

ఆధ్యాత్మిక మార్గంలో పొందే అనుభూతుల్లో ప్రాథమికంగా పొందేది భక్తి. ఆ భక్తిలో ఎవరైనా పరిపూర్ణమైతేనే జ్ఞానమార్గంలోకి ప్రవేశిస్తారు. జ్ఞానం లేని భక్తి మూఢత్వానికి, భక్తి లేని జ్ఞానం అహంకారానికి దారి తీస్తుందని అంటారు. ఇద్దాసు ప్రాథమిక స్థాయిలో అలాంటి భక్తి ప్రదర్శన చేశాడు. 

‘‘పోటు వేసిన బియ్యంబు
పాటింపు గనుకో
చాటిన వచనంబు సత్యమై నిలుచు”
అన్నాడు. అంటే.. తన మాటలు సత్యమనీ పోటు వేసిన బియ్యంతో పోల్చాడు. 

‘‘ఈదన్న జాతర నిమిషము లోపల
హంసాన సంకీర్తి చెందితిరా
అహంకార మనియేటి దున్నపోతును బట్టి 
కంసాలి కత్తితో చెండితిరా.. 
తాలింగ తాలింగ శివతీయ దుమికి
తుంగతత్వమే లింగయ” అంటాడు.

‘హంసమార్గం’ అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మమార్గం అని అర్థం. హంస, అహం దగ్గరి పదాలు. చూడ్డానికి ఒకలా అనిపిస్తాయి. హంసమార్గంలో వెళ్లేవారికి అహం అడ్డొస్తుంది. ఆ అహం కూడా దున్నపోతులా మందంగా, తామసంగా ఉంటే ‘హంస మార్గం’ సాధ్యంకాదు అని తన ‘తత్వం’లో ఇద్దాసు చెప్పుకొచ్చాడు.

తాను అహంకారం వదిలిపెట్టాడు కాబట్టే ‘ఓంకారం’గా- అంటే నాదగ్రబ్రహ్మగా మారిపోయాడు. అందువల్లనే వేదాంత పారిభాషిక పదాలన్నీ కుప్పలుపోశాడు. ఆ కాలంలో దళితుల్లో దున్న ఇద్దాసు సాధించిన ఈ మార్గం అనితరసాధ్యం. ఎందుకంటే ఎన్నో పల్లెలు అతనికి ఎదురేగి స్వాగతం పలికేవి. అలాగే గ్రామాల్లో అధికారం చెలాయించేవారు సైతం ఇద్దాసుకు పాదాక్రాంతమయ్యారు. ఇదొక సామాజిక విస్ఫోటనం.

(నేడు, రేపు (డిసెంబర్ 29, 30) తెలంగాణ పద సాహిత్యం సమాలోచన జాతీయ సదస్సు సందర్భంగా..)

- డాక్టర్‌‌‌‌‌‌‌‌ పి. భాస్కరయోగి
సోషల్​, పొలిటికల్​ ఎనలిస్ట్​