తిరుపతిలో రూల్ పెట్టి అతిక్రమించిన టీటీడీ

తిరుపతిలో రూల్ పెట్టి అతిక్రమించిన టీటీడీ

వెంకన్న సన్నిధిలో తాగునీటి లొల్లి

కొళాయి నీటిని తాగడానికి మొగ్గుచూపని భక్తులు

ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు

గాజు నీటి సీసాలు సిద్ధమైనా అనుమతికి కాలయాపన

తిరుమల, వెలుగు: తిరుమలలో తాగునీటి కోసం భక్తులు అల్లాడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్​ నీళ్ల బాటిళ్లను టీటీడీ బ్యాన్​ చేసింది. కానీ, ప్రత్యామ్నాయం చూపటంలో  విఫలమైంది. జలప్రసాదం ద్వారా నల్లా  నీటిని ఇచ్చినా..  తాగేందుకు భక్తులు మొగ్గుచూపటం లేదు. మరోవైపు ప్లాస్టిక్​బదులు గాజు సీసా ద్వారా నీటి సరఫరాకు అనుమతిపై టీటీడీ కాలయాపన చేస్తోంది. ఫలితంగా శ్రీవారి భక్తులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ప్లాస్టిక్ బ్యాన్​ మంచిదే..

శేషాచల అడవులతో కూడిన తిరుమల పుణ్యక్షేత్రం పచ్చని ప్రకృతికి ఆలవాలం. ప్లాస్టిక్ వాడకం ప్రభావం తిరుమలపై కనిపిస్తోంది. రెండు ఘాట్​రోడ్లతోపాటు తిరుమల చుట్టూ అటవీ ప్రాంతమంతా ప్లాస్టిక్​ సీసాలు, కవర్లతో నిండిపోయింది. వీటి ఏరివేతకు టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. రోజుకు 80 వేల నుంచి లక్ష మంది భక్తులు రాకపోకలు సాగించే తిరుమలలో ప్లాస్టిక్​ కవర్లు, నీటి బాటిళ్ల కారణంగా చెత్త పేరుకుపోతోంది. టీటీడీ డంపింగ్​యార్డులో రోజూ పోగయ్యే సుమారు 6 టన్నుల చెత్తలో సగభాగం ప్లాస్టిక్​తో తయారు చేసిన కవర్లు, నీటీ సీసాలే ఉన్నాయి. నిపుణుల హెచ్చరికల మేరకు టీటీడీ జనవరి 1 నుంచి ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను బ్యాన్ చేసింది. ప్రస్తుతం తాగునీటిని జలప్రసాదం పేరుతో కొళాయిల ద్వారా అందిస్తోంది. భ‌‌క్తులు నీటిని తాగేందుకు వీలుగా జ‌‌గ్గులు, కాగితం గ్లాసులను ఏర్పాటు చేశారు. ప్రతి రెస్ట్‌‌హౌస్‌‌ వరండాలో జలప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో 21 జలప్రసాదం కేంద్రాలుండగా వాటిని  122కు పెంచారు. వేగేశ్న ఫౌండేషన్​ సంస్థ నెలకు రూ.8 లక్షల ఖర్చుతో టీటీడీకి ఉచితంగా నీటిని సరఫరా చేస్తోంది. అయితే,  ఈ కొళాయి నీటిని జగ్గులు, ప్లాస్టిక్ గ్లాసులు, క్యాన్లలో  పట్టి తాగాల్సి ఉండటంతో భక్తులు మొగ్గుచూపటం లేదు. ఎక్కువ మోతాదులో నీళ్లు కావాలంటే  రాగి, స్టీల్​ బాటిళ్లు, పాత్రలు  తీసుకొస్తే ఇస్తామని టీటీడీ చెబుతోంది.

బ్యాన్ ఉల్లంఘించిన టీటీడీ

జనవరి 1వ తేదీ నుండి తిరుమలలో ప్లాస్టిక్​ నీళ్ల బాటిళ్లను టీటీడీ బ్యాన్ చేసింది. అతిక్రమించిన దుకాణదారులపై చర్యలు తీసుకుంది. అయితే, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు రావడంతో సుమారు 10 లక్షల నుండి 15 లక్షల వరకు నీళ్ల బాటిళ్లను కొనుగోలు చేసి మరీ భక్తుల దాహం తీర్చింది.

గాజు సీసాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వని టీటీడీ

ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా కార్పొరేట్​ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని గాజు సీసా నీళ్లు సిద్ధం చేశారు.  అయితే, వాటి విక్రయాలకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. గాజు సీసాలు పగిలితే భక్తులకు ఇబ్బందులు ఉంటాయని, వాటి నాణ్యత పరిశీలించాకే  నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నట్టు సమాచారం.

For More News..

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

సరోగసి బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. 16 వారాల ఇన్సూరెన్స్ 36 వారాలకు పెంపు

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్