కరోనా కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో భక్తులు ముందుగా దర్శన టికెట్లను బుక్ చేసుకొని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా.. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగష్టు 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలియజేసింది. భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ 2020 నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సోమవారం ఉదయం 11.00 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఐటీ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇందులో సెప్టెంబరు 15న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, సెప్టెంబరు 18 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. మిగతా తేదీలలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.
For More News..